మచిలీపట్నంలో ఇద్దరు వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన నెల రోజుల తరువాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.  

అమరావతి : ఓ బాలికను భయపెట్టి అత్యాచారం చేసిన ఘటన నెల తర్వాత ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనను నిందితుడు తన సెల్ ఫోన్ లో వీడియోలు, ఫోటోలు తీశాడు. అంతేకాదు ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆ బాలికను బెదిరించాడు. దీంతో బాలిక విషయాన్ని కుటుంబీకులకు ఆలస్యంగా చెప్పింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు బాధితుల కథనం మేరకు మచిలీపట్నానికి చెందిన 17 ఏళ్ల బాలిక నెల కిందట రాత్రి తన ఇంటికి వస్తుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. ఒక అడ్రస్ గురించి ఆమెను అడిగారు. 

దాని గురించి ఆమె చెబుతుండగానే.. తాము పోలీసులమని చెబుతూ తమతో రావాలని ఆమెను బెదిరించారు. ఆ తరువాత ఆమెను బలవంతంగా తమ టూవీలర్ ఎక్కించుకున్నారు. అక్కడినుంచి చిలకలపూడి రైల్వే స్టేషన్ వెనకనున్న నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లారు. అక్కడ బాలిక మీద అత్యాచారం చేశారు. ఆ సమయంలో తమ సెల్ ఫోన్ లో వీడియోలు, ఫొటోలు తీశారు. ఆ తర్వాత ఈ విషయాన్నిఇంట్లో చెబితే తాము తీసిన వీడియోలను బయటపెడతామని, చంపేస్తామని బెదిరించారు. బాలిక సెల్ ఫోన్ ను కూడా లాక్కున్నారు. దీంతో భయపడిన అమ్మాయి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేదు.

మచిలీపట్నంలో దారుణం.. బాలిక కిడ్నాప్, అత్యాచారం

ఆ తర్వాత కొద్ది రోజులు గడిచాయి. ఈ శనివారం సాయంత్రం అమ్మాయి ఇంటి బయట ఉండగా.. గతంలో బైక్ మీద తనను తీసుకువెళ్లి, అత్యాచారానికి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తుల్లో ఒకరు మళ్లీ తారసపడ్డాడు. అతడిని గుర్తుపట్టిన బాలిక ఇంట్లో వాళ్ళను పిలిచింది. విషయం చెప్పింది. వాళ్లు వెంటనే బైక్ మీద వచ్చిన వ్యక్తిని పట్టుకున్నారు. అతడిని నగరంలోని సుకర్లాబాద్ ప్రాంతానికి చెందిన నారాయణ గా గుర్తించారు. అతడిని పట్టుకుని, చితకబాది మచిలీపట్నం పోలీస్స్టేషన్లో అప్పగించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

అత్యాచార సంఘటనకు సంబంధించి మరొకరిని అదుపులోకి తీసుకోవాలని బాధితురాలి బంధువులు స్టేషన్ వద్ద డిమాండ్ చేశారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు మాత్రం ప్రాథమిక దర్యాప్తులో తానొక్కడినే బాలికను.. భయపెట్టి తీసుకువెళ్లినట్లు చెబుతున్నాడు. బాధితురాలు మాత్రం తనను ఇద్దరు తీసుకువెళ్లారని చెబుతోంది నీది నుంచి అతని ఫోన్ తో పాటు, బాలిక ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని ఆధారాల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తున్నారు. 

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు ఫోన్కు సంబంధించి సంఘటన జరిగిన రోజు కాల్ డేటా, సెల్ టవర్ లోకేషన్ వివరాలను తెప్పించి విశ్లేషిస్తున్నారు. నారాయణతోపాటు మరొకరు ఇందులో పాల్గొన్నాడా? లేదా అన్నది పరిశీలిస్తున్నారు. బాధితురాలు మైనర్ కావడం కేసు తీవ్రత దృష్ట్యా మచిలీపట్నం పీఎస్ నుంచి దీనిని దిశ పోలీస్ స్టేషన్కు జిల్లా ఎస్పీ జాషువా బదిలీ చేశారు. సోమవారం నిందితుడి అరెస్టు చూపించే అవకాశం ఉంది.