చిక్కుల్లో కేశినేని నాని: కోర్టుమెట్లెక్కిన కేశినేని ట్రావెల్స్ సిబ్బంది
ట్రావెల్స్ మూసివేసి రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు తమకు రావాల్సిన వేతన బకాయిలను ఇంత వరకు చెల్లించలేదని కేశినేని ట్రావెల్స్ సిబ్బంది ఆందోళనకు సిద్ధమయ్యారు.
టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నానికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. వేతనాల కోసం ఆ సంస్థ సిబ్బంది ధర్నాకు దిగారు. లెనిన్ సెంటర్ వరకు ప్రదర్శనగా వెళ్లిన కార్మికులు అక్కడ నిరసనకు దిగారు. తమకు బకాయిపడ్డ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాకుండా జీతాలు చెల్లించకుండా కేశినేని ట్రావెల్స్ మూసివేశారని పలువురు కార్మికులు లేబర్ కోర్టును ఆశ్రయించారు. కేశినేని నాని కుటుంబానికి చెందిన కేశినేని ట్రావెల్స్కు దాదాపు 90 ఏళ్ల చరిత్ర ఉంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులకు ప్రతి రోజుల వందల సంఖ్యలో కేశినేని ట్రావెల్స్ సర్వీసులను నడిపేది. అయితే 2017లో నాటి ఏపీ రవాణా శాఖ కమీషనర్ సుబ్రమణ్యంతో ఎంపీ నాని, ఎమ్మెల్యే బొండా ఉమా గొడవపడటంతో అది వైరల్ అయ్యింది.
దీనికి తోడు భారీగా ప్రైవేట్ బస్సులను నడుపుతూ ఆర్టీసీ ఖజానాకు గండికొడుతున్నారని విపక్షాలు సైతం ఆందోళనకు దిగడంతో 2017 ఏప్రిల్ 7న కేశినేని ట్రావెల్స్ను మూసివేస్తున్నట్లు సంస్థ అధినేత కేశినేని నాని ప్రకటించిన సంగతి తెలిసిందే.