టీడీపీకి, ఎంపీ పదవికి కేశినేని నాని రాజీనామా ..చివరిగా చంద్రబాబుకు థ్యాంక్స్
విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం తన లోక్సభ సభ్యత్వానికి , తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం తన రాజీనామా లేఖలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు పంపారు.
![kesineni nani resign lok sabha membership and tdp ksp kesineni nani resign lok sabha membership and tdp ksp](https://static-ai.asianetnews.com/images/01hkskv65d301f8z011fft0562/kesineni-nani-jpg_363x203xt.jpg)
విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపారు. స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా చేసిన ఆయన.. ఆమోదించాల్సిందిగా కోరారు. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా నాని రాజీనామా చేశారు. అనంతరం రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. రాజీనామా లేఖను మెయిల్ ద్వారా పంపడంతో పాటు సోషల్ మీడియాలోనూ షేర్ చేశారు.
వ్యక్తిగత కారణాలతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్న కేశినేని నాని.. ఇంతకాలం పార్టీలో సహకరించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని కోణాల్లోనూ ఆలోచించిన తర్వాతే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని, పార్టీలో కొనసాగకూడదనే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు.
మరోవైపు.. కేశినేని కుమార్తె, విజయవాడ కార్పోరేషన్ 11వ డివిజన్ కార్పోరేటర్ కేశినేని శ్వేత కూడా టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, తన కార్పోరేటర్ పదవికి కూడా రాజీనామా చేసిన సంగతతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ తండ్రీ కూతుళ్లిద్దరూ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. అనంతరం కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ.. 2014 నుంచి 19 వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి పనికిరాని వ్యక్తని, ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం టీడీపీ ఖాళీ కాబోతోందని చెప్పారు.
చంద్రబాబు మోసగాడని ప్రపంచానికి తెలుసునని, కానీ మరీ ఇంతగా దగా చేస్తాడని తెలియదంటూ నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయవాడ అంటే తనకు ఎంతో ప్రేమ అని .. నియోజకవర్గం కోసమే ఇంతకాలం టీడీపీలో వున్నానని కేశినేని పేర్కొన్నారు. తన రాజీనామా ఆమోదం పొందిన తక్షణం తాను వైసీపీలో చేరుతానని స్పష్టం చేశారు.