ఉండవల్లి ఇంటిపై కేసీఆర్ వ్యాఖ్యలు: చంద్రబాబు డైలమా
చంద్రబాబునాయుడు నివాసం గురించి గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్ ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇదే విషయమై పదే పదే గుర్తు చేసుకొంటున్నారు.
అమరావతి : చంద్రబాబునాయుడు నివాసం గురించి గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేసీఆర్ ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇదే విషయమై పదే పదే గుర్తు చేసుకొంటున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తన వ్యవసాయక్షేత్రంలో నిర్వహించిన ఆయుత చంఢీయాగంలో పాల్గొనాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఆహ్వానించేందుకు గతంలో అమరావతికి వచ్చారు. ఆ సమయంలో ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇంట్లోనే ఆయనతో కేసీఆర్ భేటీ అయ్యారు.
చంఢీయాగానికి రావాలని కేసీఆర్ చంద్రబాబును ఆహ్వానించారు. కేసీఆర్కు టీడీపీ నేతలు కొందరు సెడాంఫ్ చెప్పేందుకు వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ నేతలతో కేసీఆర్ కొద్దిసేపు మాట్లాడారు.
ఎందుకు చంద్రబాబునాయుడు ఈ భవనంలో ఉంటున్నాడని ఆయన ప్రశ్నించారు.గుంట ఉన్న ప్రదేశంలో చంద్రబాబు నివాసం ఉంటున్నాడని... ఇది సరికాదనే అభిప్రాయాన్ని కేసీఆర్ నాడు వ్యక్తం చేశారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. వాస్తు సరిగా లేని కారణంగానే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని టీడీపీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.
మరో వైపు చంద్రబాబు ఉంటున్న భవనానికి పక్కనే నిర్మించిన ప్రజా వేదిక వల్ల కూడ వాస్తుపరంగా బాబుకు ఇబ్బందులేనని కొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. అయితే ఈ అభిప్రాయాలను చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదని చెబుతారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోయి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్దంగా ప్రజా వేదికను కూల్చేశారు. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇల్లు కూడ నిబంధనలకు విరుద్దంగా నిర్మించారని జగన్ చెప్పారు.
కరకట్టపై అక్రమంగా నిర్మించిన భవనాలను నోటీసులు ఇచ్చారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని సీఎం విస్పష్టం చేశారు.అయితే చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇల్లును గ్రామ పంచాయితీ అనుమతితో నిర్మించినట్టుగా టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో నిర్మించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
లింగమనేని రమేష్ ఇంటిపై ఇంత రాద్దాంతం జరుగుతున్న సమయంలో ఇంకా అదే నివాసంలో ఉండడం సరైంది కాదనే అభిప్రాయంతో కొందరు నేతలు ఉన్నారు. చంద్రబాబు కోసం కొందరు నేతలు గుంటూరు, విజయవాడల్లో ఇళ్లను కూడ చూశారు. అయితే ఈ ఇంటిని చంద్రబాబు ఖాళీ చేస్తారా.... లేదా అనేది ఇంకా తేలలేదు.