రేపు జగన్ సమక్షంలో వైసీపీలోకి

మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ కి రాజీనామా చేశారు. ఈ నెల 25న ఆయన జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన తర్వాత ఆ పదవి తనకే దక్కుతుందని కన్నా భావించారు. అయితే.. ఆయన అంచనా తలకిందులైంది. దీంతో మనస్థాపానికి గురైన కన్నా.. పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తన పేరును చివరి వరకు పరిశీలించి.. ఆఖరి క్షణంలో వలస నేతగా పరిగణించి దూరంగా పెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. పైగా ఆ పదవిని ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించని వారికి (సోము వీర్రాజుకు) ఇస్తున్నారని తేలడంతో కన్నా కినుక వహించి రాజీనామా చేశారు. అదీగాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.

ఒకవేళ బీజేపీలో కొనసాగి.. ఎన్నికల బరిలోకి దిగితే డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదన్న భావనకు వచ్చిన ఆయన బీజేపీని వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రెండ్రోజులపాటు తన అనుయాయులతో మంతనాలు జరిపి వారి మనోగతానికి అనుగుణంగా వైసీపీలో చేరాలని నిశ్చయించారు. ఇప్పటికే తనతో మంతనాలు సాగిస్తున్న వైసీపీ ముఖ్యులతో ఫోన్లో చర్చలు జరిపిన ఈ నెల 25న చేరికకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.

రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని జగన్ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఆయనకు అనుభవం ఉన్న నేతలు ఎంతగానో అవసరం. అందుకే.. టీడీపీ, బీజేపీల నుంచి మంచి మంచి ఆఫర్లు ఇచ్చి మరీ తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడు.కన్నాకి జగన్ సూపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కన్నాకు పెదకూరపాడు సీటుపై జగన్‌ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఆయన సన్నిహితుడైనఎన్నారై తేళ్ల వెంకటేశ్‌ యాదవ్‌కు ప్రకాశం జిల్లా చీరాల టికెట్‌ ఇస్తామని కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం.