వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి హాజరు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇవాళ సీబీఐ విచారణకు హాజరయ్యారు. 72 రోజులుగా ఈ కేసు విచారణ సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అవినాష్ రెడ్డి సన్నిహితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి ఇటీవలనే సీబీఐ విచారణకు హాజరయ్యారు.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి మంగళవారం నాడు హాజరయ్యారు.72 రోజులుగా సీబీఐ అధికారులు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్నారు. పులివెందులలోని ఆర్అండ్బి గెస్ట్ హౌస్ లో సీబీఐ అధికారులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ విచారణకు జగదీశ్వర్ రెడ్డి, భరత్ కుమార్ లు కూడా హాజరయ్యారు.
ఇటీవలనే వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు శివశంకర్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.శివశంకర్ రెడ్డి అనుచరుడుగా ఉన్న మణికంఠరెడ్డి తమ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించాడని వివేకానందరెడ్డి కూతురు సునీత పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో గోవాలో సునీల్ యాదవ్ ను అరెస్ట్ చేసిన తర్వాత కీలక సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరించారు.ఈ కేసులో సునీల్ యాదవ్ కు నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహించాలని కూడా సీబీఐ భావిస్తోంది.ఈ మేరకు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.