బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ పనిచేస్తున్న ఇంటి యజమాని కుటుంబాన్ని దారుణంగా హత్య చేశాడు. ఇంట్లో దొంగతనం చేయబోతే అడ్డుకోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది.
లక్కిరెడ్డి పల్లె : YSR District లక్కిరెడ్డిపల్లె మండలంలోని దిన్నెపాడు కస్బాకు చెందిన శ్రీరాములు కుమారుడు పిలోళ్ల వెంకటేష్ Kuwaitలో తాను పనిచేస్తున్న యజమానిని, అతడి భార్య, కుమార్తెలను హత్య చేసినట్లు వచ్చిన సమాచారం సంచలనం సృష్టిస్తోంది. వెంకటేష్ మూడేళ్ళ క్రితం బ్రతుకుతెరువు కోసం కువైట్ వెళ్ళాడు. అక్కడ ఒకరి ఇంట్లో driverగా పని చేస్తున్నాడు. రెండేళ్ల తర్వాత తన భార్య స్వాతిని కూడా కువైట్ కు తీసుకువెళ్ళాడు. వీరికి ఇద్దరు కుమారులు.
వారిని వెంకటేష్ అమ్మానాన్నల వద్ద వదిలారు. వారం క్రితం తనకు కువైట్ నుంచి ఫోన్ వచ్చిందని.. యజమానిని, ఆయన భార్య కూతుర్లను వెంకటేష్ కత్తితో గొంతు కోసి చంపాడని పోలీసులు తీసుకెళ్లినట్లు అవతలి వ్యక్తి నుంచి సమాచారం వచ్చిందన్నారు. తన కుమారుడికి ఉరిశిక్ష పడుతుందని తెలిపారని శ్రీరాములు చెబుతున్నాడు. వారం రోజుల క్రితం వెంకటేష్ఇంటికి ఫోన్ చేసి పిల్లల క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడని, కానీ, ఇంతలోనే ఇలా జరిగిందా? అని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ విషయమై జిల్లా పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు.
అయితే, కువైట్లో వారం రోజుల కిందట జరిగిన మూడు హత్యల ఉదంతం జిల్లాలోని రాయచోటి పరిసర ప్రాంతాల్లో కలకలం రేపుతోంది. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి హత్య కేసులో నిందితుడిని గత మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అక్కడ ఓ సేఠ్ ఇంట్లో చోరీకి ప్రయత్నించిన అతడు అడ్డొచ్చిన ఆయన కుటుంబాన్ని దారుణంగా హతమార్చాడు. గురు లేదా శుక్రవారం నిందితుడిని కువైట్ ప్రభుత్వం ఉరి తీయనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
జిల్లాలో రాయచోటి పరిసర ప్రాంతానికి చెందిన దంపతులు కువైట్ లో పనిచేస్తున్నారు. వీరికి అప్పులు పెరిగి పోవడంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్న ఆ భర్త తన భార్య పనిచేస్తున్న సేట్ ఇంట్లో ఈ నెల ఆరవ తేదీన చోరికి ప్రయత్నించాడని.. అడ్డు వచ్చిన సేటు తో పాటు ఆయన భార్య, కుమార్తెలను కత్తితో గొంతు కోసి హత్య చేశాడని సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.
ఈ నెల 7న కువైట్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారని, ప్రస్తుతం జైల్లో ఉన్నాడని ప్రచారం. ఈ ఘటనకు సంబంధించి కువైట్ రాయబార కార్యాలయం నుంచి గానీ, జిల్లా పోలీసు శాఖకు గాని సమాచారం లేకపోవడంతో ధ్రువీకరించలేక పోతున్నారు. నిందితుడికి సంబంధించిన చిరునామా గాని, వివరాలు గాని బయటకు రాలేదు. మరోపక్క జిల్లాలో కువైట్ కి వెళ్ళిన వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కాగా వెంకటేష్ కుటుంబసభ్యుల సమాచారం మేరకు నిందితుడు వెంకటేష్ గా ఇప్పుడు బయటపడింది.
