వీడిన ‘‘పీఠ’ముడి: బ్రహ్మంగారి మఠం ‘‘ వెంకటాద్రి’’దే
నెలలుగా నానుతోన్న కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి ఎంపిక ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కుటుంబ సభ్యుల మధ్య జరిపిన రాజీ యత్నాలు ఫలించాయి
నెలలుగా నానుతోన్న కడప జిల్లా బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి ఎంపిక ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కుటుంబ సభ్యుల మధ్య జరిపిన రాజీ యత్నాలు ఫలించాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఉదయం నుంచి మఠంలో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. రెండు కుటుంబాల వారసులు ఏకాభిప్రాయానికి రావడంతో సమస్య పరిష్కారమైంది. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామికి బాధ్యతలు అప్పగించారు. ఇక ఉత్తరాధికారిగా మొదటి భార్య రెండో కుమారుడు వీరభద్రస్వామి నియమితులయ్యారు. వెంకటాద్రిస్వామి త్వరలోనే బాధ్యతలు తీసుకుంటారని ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ తెలిపారు. త్వరలోనే పీఠాధిపతి ప్రమాణ స్వీకారం వైభవంగా నిర్వహిస్తామని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వెల్లడించారు.
అంతకుముందు బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వ్యవహారం శనివారం కీలక మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. బ్రహ్మంగారి మఠం దివంగత 12వ పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి శనివారం మీడియాతో మాట్లాడుతూ..మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పీఠాధిపత్యం విషయంలో తనతో ఇంతవరకు చర్చించలేదన్నారు. పెద్ద భార్య కుమారులైన వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి మాత్రమే ఎమ్మెల్యేతో సమావేశమయ్యారని, సాయంత్రం తనతో చర్చిస్తామని మాత్రమే ఎమ్మెల్యే చెప్పారని మహాలక్ష్మీ వెల్లడించారు. దీనికిమించి ఎలాంటి ఏకాభిప్రాయానికి రాలేదని ఆమె పేర్కొన్నారు.
Also Read:బ్రహ్మంగారి మఠం వివాదంలో ట్విస్ట్: మైదుకూరు ఎమ్మెల్యేపై పీఠాధిపతి రెండో భార్య వ్యాఖ్యలు
ఇప్పటి వరకు తాను పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామికి మద్దతు పలకలేదని ఆమె స్పష్టం చేశారు. వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మహాలక్ష్మీ అన్నారు. తనకు న్యాయం జరిగితే మాత్రమే ఏకాభిప్రాయానికి వస్తానని ఆమె స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని సాయంత్రం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, దేవాదాయశాఖతో చర్చించిన అనంతరం ప్రకటిస్తానని పేర్కొన్నారు.