చంద్రబాబు బాణాన్ని కాదు, జగన్ కు రాజకీయాలు అవసరమా.. : కేఏ పాల్ కంటతడి
ప్రస్తుతం తనను మళ్లీ అరెస్టు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రూ.30వేల కోట్లు వసూలు చేశానని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పైనా, వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ఏపీలో ప్రస్తుత రాజకీయాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ తాను సీఎం చంద్రబాబు వదిలిన బాణాన్ని అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
తాను వైసీపీ, జనసేన ఓట్లను చీల్చడానికి రాలేదన్నారు. కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ కేఏ పాల్ కంటతడిపెట్టారు.
తనను గతంలో ఒక నేరస్థుడిలా అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. తనను 50 సార్లు అరెస్ట్ చేశారని అయినా తనను అడ్డు కోలేకపోయారని తనను వేధించిన వాళ్లు ఏమయ్యారో ప్రజలకు తెలుసునన్నారు.
ప్రస్తుతం తనను మళ్లీ అరెస్టు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రూ.30వేల కోట్లు వసూలు చేశానని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పైనా, వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వైఎస్ విజయమ్మ, జగన్ లను మీకు రాజకీయాలు అవసరమా అంటూ ప్రజలు నిలదీస్తారని ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేఏ పాల్ శాపనార్థాలు పెట్టారు.