ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు ఏపీకి రానున్నారు. ఫిబ్రవరి 24న ఆయన ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పదవీ కాలం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. మంగళవారం రాజ్ భవన్ లో జరిగిన ఈ వీడ్కోలు కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సమయంలో గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ తో పాటు సీఎం జగన్ కూడా ఉద్వేగానికి లోనయ్యారు. బుధవారం ఉదయం కూడా మరోమారు బిశ్వ భూషణ్ హరిచందన్ కు వీడ్కోలు పలికారు. ఎయిర్పోర్టులో ఘనంగా వీడ్కోలు ఏర్పాటు చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్గా కేంద్ర ప్రభుత్వం జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమించింది. జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏపీ కొత్త గవర్నర్గా ఫిబ్రవరి 24వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ చేరుకొనున్నారు. కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి కావలసిన ఏర్పాట్లను రాజ్ భవన్ వర్గాలు చేస్తున్నాయి. జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి సతీసమేతంగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు.

చీకటి గదిలోకి తీసుకెళ్లి చితక్కొడుతూ... నాపై పోలీసుల థర్డ్ డిగ్రీ : టిడిపి నేత పట్టాభిరాం

రాష్ట్ర విభజన అనంతరం సయ్యద్ అబ్దుల్ నజీర్ ఏపీకి మూడో గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. అబ్దుల్ నజీర్ కర్ణాటకకు చెందినవారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి, గత నెల రిటైర్ అయ్యారు. అబ్దుల్ నజీర్ కు న్యాయమూర్తిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయకుండానే నేరుగా దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోట్ అయ్యారు. ఇలా ప్రమోట్ అయిన వారిలో మూడో వ్యక్తి అబ్దుల్ నజీర్.

అంతేకాదు ఆయన జనవరిలో జస్టిస్ గా పదవీ విరమణ చేశారు. ఒక నెల విరామంలోనే ఫిబ్రవరి నెల చివర్లో రాష్ట్ర గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేస్తుండడం మరో విశేషం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నజీర్ ట్రాక్ రికార్డులు కీలకమైనవే. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కేసుల్లో ఆయన కీలకమైన తీర్పులిచ్చారు. అయోధ్య- బాబ్రీ మసీదు వివాదం, ట్రిపుల్ తలాక్, నోట్ల రద్దు, గోప్యత హక్కు లాంటి కేసులను విచారించారు. ఈ కేసులను విచారించిన బహుళ ధర్మాసనంలో ఏకైక మైనార్టీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్.