వైసీపీ ఓట్లను చీల్చేందుకే కేఏపాల్ పార్టీ...శ్వేతారెడ్డి
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ పై జర్నలిస్టు శ్వేతారెడ్డి మండిపడ్డారు. కేఏపాల్ టికెట్లు అమ్ముకుంటున్నారనే అనుమానాలు తనకు ఉన్నాయని ఆమె అన్నారు.
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ పై జర్నలిస్టు శ్వేతారెడ్డి మండిపడ్డారు. కేఏపాల్ టికెట్లు అమ్ముకుంటున్నారనే అనుమానాలు తనకు ఉన్నాయని ఆమె అన్నారు.మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
హిందూపురం అభ్యర్థి, మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరు ప్రకటించారని, అనంతరం ఇటీవల జరిగిన ఓ సభలో తాను అడ్రస్ లేకుండా పోయానంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ సమావేశంలో తనను ప్రజాశాంతి పార్టీ మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటించారని తెలిపారు. ఈ నెల 21 వరకు 10 వేల సభ్యత్వాలు చేయించమన్నారని, 21వ తేదీ రాకముందే వైజాగ్ సభలో శ్వేతారెడ్డి అడ్రస్ లేకుండా పోయానని తనను అనడం వెనక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
హిందూపురం టికెట్ను ఇంకెవరికైనా అమ్ముకుంటున్నారనే అనుమానం తనకు కలుగుతోందని ఆమె అన్నారు. ప్రజాశాంతి పార్టీకి ఎజెండా లేదని, ఓ సిద్ధాంతం లేదని ఆరోపించారు. కేఏ పాల్ నోరు తెరిస్తే ట్రంప్, ఒబామా అంటున్నారని, మిలియన్స్, ట్రిలియన్స్ డాలర్లు అంటూ.. అమరావతి అభివృద్ధికి రూ.10 కోట్లు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు.
సభ్యత్వం పేరుతో రూ.10, 100 ఎందుకు వసూలు చేస్తున్నారో వివరించాలని ఆమె డిమాండ్ చేశారు. క్రిస్టియన్ కమ్యూనిటీని అవమానపరిచేలా పాల్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఓట్లను చీల్చేందుకు రాజకీయం చేస్తున్నట్లుగా తనకు అనుమానంగా ఉందన్నారు.