Asianet News TeluguAsianet News Telugu

జానీవాకర్ తాగానా, కుక్కలు మొరిగితే సమాధానమా: జెసి

తెలుగుదేశం పార్టీ మహానాడులో తాను మాట్లాడిన విషయాలను పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సమర్థించుకున్నారు. 

JC diwakar Reddy says he spoke facts

అనంతపురం:  తెలుగుదేశం పార్టీ మహానాడులో తాను మాట్లాడిన విషయాలను పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సమర్థించుకున్నారు. తాను ఉన్నదే మాట్లాడానని, అవసరమైతే ఆధారాలతో నిరూపిస్తానని ఆయన అన్నారు.

ఎవరిపైనా అభూతకల్పన చేయాల్సిన అవసరం తనకు లేదని, తనపై విమర్శలు చేసే అర్హత ఇతరులకు లేదని ఆయన అన్నారు. శనివారం అనంతపురంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు సంబంధించి తాను ఎలాంటి అభూతకల్పన చేయలేదని, దుర్మార్గంగా ఎక్కడా మాట్లాడలేదని అన్నారు.
 
జానీవాకర్‌ తాగి మాట్లాడానని అంటున్నారని, అసలు జానీవాకర్‌ అంటే ఏమిటని, తమ కుటుంబంలో ఏ ఒక్కరికి కూడా మందు తాగే అలవాటు లేదని అన్నారు. మందు అలవాటు ఉన్నవారే అలాంటి వాటిపై మాట్లాడతారని తిప్పికొట్టారు. 

తాను మాట్లాడిన ప్రతి మాటనూ ఎవరు ముందుకు వచ్చినా సరే సాక్ష్యాధారాలతో నిరూపిస్తానని అన్నారు. పూటకో పార్టీ మారే వారు తన గురించి మాట్లాడుతున్నారని అన్నారు.. రోడ్డుపై వెళ్లే కుక్కలు మొరిగితే తాను స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్‌ రాజారెడ్డి మంగంపేటకు వెళ్లి ఒకరిని చంపి వాళ్ల ఆస్తిని లాక్కోలేదా అని ప్రశ్నించారు. వాస్తవం మాట్లాడితే తనకు శవయాత్ర చేస్తారా అని మండిపడ్డారు. తనకు శవయాత్ర చేయడానికి వాళ్లెవరని, తనకు పుట్టిన వాళ్లు అయితేనే చేస్తారని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios