Chandrababu - Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాదులోని జనసేనాని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది. ఇరువురు భేటీపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు వివరణ ఇచ్చారు.
Chandrababu - Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాదులోని జనసేనాని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది. ఇరువురు భేటీపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు వివరణ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ప్రధాన అజెండాగా పవన్ కళ్యాణ్,చంద్రబాబు నాయుడు మధ్య ఆదివారం రాత్రి ప్రత్యేక భేటీ జరిగిందని తెలిపారు. రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు అందించే దిశగా చర్చలు సాగాయని తెలిపారు. వైసీపీ విముక్త ఏపీ కోసం ఎలా కలిసి పనిచేయాలో చర్చించినట్టు నాదెండ్ల వివరించారు.
ఇరు పార్టీల అధినేతల భేటీ చాలా సంతృప్తికరంగా సాగిందనీ, అనేక అంశాలపై చర్చలు సుహృద్భావంగా జరిగాయని తెలిపారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే ఉమ్మడి ధ్యేయంగా వచ్చే ఎన్నికల్లో సమష్టిగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపైనా, ఉమ్మడి మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ..ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలి? దాని కోసం ప్రత్యేక వ్యూహంపైనా ఓ సమష్టి కార్యాచరణ తీసుకున్నామనీ, భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి,ఎన్నికల యాక్షన్ ప్లాన్ గురించి చర్చించామని తెలిపారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఇరు పార్టీల అధినేతలు పూర్తి స్థాయిలో చర్చించారు. వైసీపీని దీటుగా ఎదుర్కోవడమే కాకుండా, వైసీపీ విముక్త రాష్ట్రాన్ని సాధించేందుకు అవసరం అయిన అన్ని విషయాల పట్ల పూర్తిస్థాయి చర్చ జరిగిందని తెలిపారు. అధినేతల మధ్య జరిగిన భేటీలో చర్చకు వచ్చిన ఇతర కీలకమైన అంశాల గురించి తర్వాత ప్రత్యేకంగా మాట్లాడుతామని నాదెండ్ల మనోహర్ అన్నారు.
