ఎంతో ఒత్తిడికి గురవుతూ... అక్రమ అరెస్టులు తట్టుకుంటూ కూడా పంచాయితీ ఎన్నికల్లో జనసైనికుల చూపిస్తున్న పోరాటపటిమ అద్భుతమని నాదెండ్ల మనోహర్ అన్నారు. 

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల్లో జనసేన పుజుకోవడం ఆనందదాయకమని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎంతో ఒత్తిడికి గురవుతూ... అక్రమ అరెస్టులు తట్టుకుంటూ కూడా జనసైనికుల చేస్తున్న పోరాటపటిమ అద్భుతం అన్నారు. జనసేన అద్యక్షులు పవన్ కల్యాణ్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా యువత, మైనారిటీ మహిళలు, పురుషులు పార్టీ బలపర్చిన అభ్యర్థుల విజయంకోసం ఎంతో కృషిచేస్తున్నారని అన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అధికార వైసీపీ ఎన్ని అవరోధాలు సృష్టించినా జనసేన శ్రేణులు పార్టీ సిద్ధాంతాలు, భావజాలంతో ముందుకెళ్ళడం అభినందనీయమన్నారు. సర్పంచులుగా, వార్డ్ మెంబర్లుగా గెలిచిన అభ్యర్థులకు పార్టీ ప్రెసిడెంట్ తరుపున అభినందిస్తున్నానని పేర్కొన్నారు. రాబోయే మూడు, నాలుగు దఫాల ఎన్నికలో కూడా జనసేన మరింతగా పుంజుకుంటుంది అని నాదెండ్ల ఆశాభావం వ్యక్తం చేశారు. 

read more పంచాయతీ ఎన్నికలు: అవకతవకలపై ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు

ఇదిలావుంటే జనసేన మిత్రపక్ష బిజెపి మాత్రం పంచాయితీ ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయని ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. నిన్న(ఆదివారం) గుంటూరు జిల్లా రెంటచింతల, దాచేపల్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి విశ్వాసం లేదన్నారు. సంక్షేమ పథకాలపై నమ్మకముంటే ఎందుకీ ఏకగ్రీవాలంటూ ఆయన ప్రశ్నించారు.

సరైన పద్దతిలో ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదనే భయం వైఎస్ఆర్‌సీపీలో కన్పిస్తోందన్నారు.పోలీస్, రెవిన్యూ, పంచాయితీరాజ్ శాఖ అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. విపక్షాలకు చెందిన అభ్యర్ధులకు ధృవపత్రాలు కూడ అధికారులు ఇబ్బందులకు గురి చేశారని ఆయన విమర్శించారు. ఈ విషయాలపై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు.

ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం తీరును విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్ఆర్‌సీపీ ఏకగ్రీవాలను చేయించిందని విపక్షాలు ఆరోపించాయి.