ఒంగోలులో సీఎం జగన్ కాన్వాయ్ కోసం తిరుపతి వెళ్తున్న యాత్రికుల కారును లాక్కొన్న ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎవరి ఒత్తిళ్లతో ప్రయాణీకులను దింపారని పవన్ ప్రశ్నించారు.
ప్రకాశం జిల్లా (prakasam district) ఒంగోలులో (ongole) సీఎం జగన్ కాన్వాయ్ (cm jagan convoy) కోసం తిరుపతి వెళ్తున్న ఓ కుటుంబానికి చెందిన కారును పోలీసులు బలవంతంగా లాక్కోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) ఘాటుగా స్పందించారు. సీఎం కాన్వాయ్ కోసం ప్రజల వాహనాలు స్వాధీనం ఏంటని ఆయన నిలదీశారు. జగన్ పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్ధితి రాష్ట్రంలో నెలకొందా అని పవన్ ప్రశ్నించారు. ఎవరి ఒత్తిళ్లతో ప్రయాణీకులను దింపారని ఆయన దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయం (cmo) దీనిపై వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
అటు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు (chandrababu naidu) సైతం ఈ వ్యవహారంపై స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రేపు (శుక్రవారం) ఒంగోలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు సామాన్య ప్రజలను ఇబ్బందిపెట్టడం దారుణమన్నారు. సీఎం కాన్వాయ్ కోసమంటూ పిల్లాపాపలతో తిరుపతి వెళుతున్న ఓ కుటుంబాన్ని రోడ్డుపైనే వదిలేసి కారును లాక్కెళ్లడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రజాసేవ చేయాల్సిన ముఖ్యమంత్రి ఇలా ప్రజలను ఇబ్బందిపెట్టడం ఏంటని ప్రశ్నించారు. సీఎం కాన్వాయ్ కోసం ఆర్టీఏ అధికారులు సామాన్య ప్రజల కార్లను లాక్కెళ్ళడం రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు.
అసలేం జరిగింది:
పల్నాడు జిల్లా వినుకొండకు (vinukonda) చెందిన వేమల శ్రీనివాస్ కుటుంబం తిరుమలకు బయలుదేరింది. ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలు ఇన్నోవా కారులో తిరుపతికి బయలు దేరారు. ఒంగోలు పట్టణంలోని బుధవారం నాడు రాత్రి చేరుకున్నారు. పాత మార్కెట్ సెంటర్ లోని హోట్ వద్ద శ్రీనివాస్ కుటుంబం టిఫిన్ చేస్తున్న సమయంలో కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి అక్కడికి వచ్చి సీఎం పర్యటన నేపథ్యంలో వాహనం కావాలని అడిగాడు. తాము తిరుపతికి వెళ్తున్నామని చెప్పినా కూడా విన్పించుకోకుండా డ్రైవర్ తో సహా వాహనాన్ని తీసుకెళ్లాడు. దీంతో తిరుమల వెళ్ళాల్సిన శ్రీనివాస్ కుటుంబం ఒంగోలులోనే చిక్కుకుంది. చివరకు మరో వాహనం తెప్పించుకుని వారు తిరుమలకు చేరుకున్నారు.
