రాష్ట్రంలో ఔషదాల కొరత... సీఎం జగన్ పై మండిపడ్డ పవన్..!
ఆక్సీజన్ అందరికీ చాలా అవసరమని.. అలాంటి అత్యవసర విషయాల్లో కొరత ఎందుకు వస్తోందని.. ప్రభుత్వానికి ఎందుకింత నిర్లప్తత అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈక్రమంలో ఆక్సీజన్ అందుబాటులో లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిపపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఎం వైఎస్ జగన్ పై మండిపడ్డారు.
ఆక్సీజన్ అందరికీ చాలా అవసరమని.. అలాంటి అత్యవసర విషయాల్లో కొరత ఎందుకు వస్తోందని.. ప్రభుత్వానికి ఎందుకింత నిర్లప్తత అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రజలు సరైన ఔషధాలు అందక ఊపిరి వదిలేస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘కరోనా మృతుల లెక్కలు దాయగలరు, బాధిత కుటుంబాల కన్నీటిని అడ్డుకోలగరా?. మన రాష్ట్రం రోమ్... మన పాలకులు నీరో వారసులు కారాదు. ఆక్సిజన్ అందక, బెడ్స్ లేక చనిపోవడం చూస్తే బాధకలుగుతుంది. రెమిడిసివర్ ఒక్కో ఇంజక్షన్ను రూ.40వేలకు అమ్ముతుంటే సామాన్యులు, పేదలు తమ ప్రాణాలను ఎలా కాపాడుకోగలరు?. వేల కొద్దీ అంబులెన్సులు ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పారు. రోగులను మాత్రం ఆస్పత్రులకు తరలించలేకపోతున్నారు. అధికారులను నియమించి ఏం ప్రయోజనం?. ఆక్సిజన్ డిమాండ్ కు తగినట్లుగా సరఫరా... అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఇంటింటికీ కావాల్సింది ఇంటర్నెట్, మేకలు మాత్రమే కాదు. కరోనా నుంచి రక్షించే ఔషధాలు, ఆక్సిజన్ కూడా అని గ్రహించాలి. వీటిపై సీఎం జగన్ రెడ్డి దృష్టి పెట్టాలి. ఈ విపత్కర పరిస్థితుల్లో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలి. వైద్య, నర్సింగ్ సిబ్బంది సమస్యలపై దృష్టిపెట్టాలి. ఎన్నో భయాందోళనల నడుమ ఫ్రంట్ లైన్ వారియర్స్గా వారు విధులు నిర్వర్తిస్తున్నారు.’’ అని పవన్ పేర్కొన్నారు.