పొట్టి శ్రీరాములు స్పూర్తిని భావితరాలకు అందిస్తాం : పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం పడేందుకు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగమే కారణమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అమరజీవి స్పూర్తిని భావితరాలకు అందించే బాధ్యత జనసేన పార్టీదేనని పవన్ పేర్కొన్నారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయనకు ఏపీ వాసులు, వివిధ రాజకీయ పార్టీలు నివాళులర్పిస్తున్నాయి. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బీజం పడేందుకు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగమే కారణమన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ ఒక వ్యాసంలో పొట్టి శ్రీరాములు గురించి ప్రస్తావించిన మాటలను పవన్ కల్యాణ్ వివరించారు. ఆయన దీక్ష, తదనంతర పరిణామాలు భారతదేశ చిత్రపటాన్ని భాషా ప్రయుక్త రేఖల్లో పున: చిత్రీకరించాయని గుహ పేర్కొన్నారని జనసేనాని వెల్లడించారు.
అంతేకాకుండా పొట్టి శ్రీరాములను భారతదేశ మెర్కాటర్ (ప్రపంచ పటాన్ని తయారు చేసిన భౌగోళిక శాస్త్రవేత్త)గా అభివర్ణించవచ్చన్నారు. ప్రతి సందర్భంలోనూ పొట్టి శ్రీరాములను తమ పార్టీ స్మరించుకుంటుందని పవన్ అన్నారు. జనసేన పదవ ఆవిర్భావ సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరును నిర్ణయించడం అందులో భాగమేనని జనసేనాని స్పష్టం చేశారు. ఆ అమరజీవి స్పూర్తిని భావితరాలకు అందించే బాధ్యత జనసేన పార్టీదేనని పవన్ పేర్కొన్నారు.