సమయం ఆసన్నమైంది... స్టీల్ ప్లాంట్ కోసం రంగంలోకి పవన్ కల్యాణ్: నాదెండ్ల ప్రకటన
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇంతకాలం చోటుచేసుకున్న పరిణామాలను ఓపికగా వేచి చూసామని... ఇప్పుడు మా స్వరం వినిపిస్తున్నామని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
విశాఖపట్నం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వచ్చే నెల(అక్టోబర్)లో విశాఖలో పర్యటించి స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాటానికి మద్దతు తెలుపుతారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లే సమయం అసన్నమైందని నాదెండ్ల పేర్కొన్నారు.
''ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా మంచి నిర్ణయాలు కేంద్రం తీసుకోవాలి. ఇన్ని రోజులు స్టీల్ ప్లాంట్ విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఓపికగా వేచి చూసాం. ఇప్పుడు మా స్వరం వినిపిస్తున్నాము. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ బిజెపి నాయకులతో మాట్లాడి వారిని ఒప్పిస్తారు'' అని ధీమా వ్యక్తం చేశారు.
''ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ చర్చించారు. ఆయనపై కేసులు లేవు కాబట్టి అమిత్ షా ను రాజీ కోసం కలవలేదు. రాష్ట్ర సమస్యలపై బలంగా తన వాణి వినిపించడానికే కలిసారు'' అని తెలిపారు.
read more బీజేపీకి షాక్ : విశాఖ ఉక్కు పోరాటంలో పవన్ పాల్గొంటారు... నాదెండ్ల మనోహర్
''వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన సమస్యలు మరెప్పుడు రాలేదు. అమరావతి రైతులు ఉద్యమం పట్ల కూడా జనసేన స్థిరంగా ఉంది. ఇతర పార్టీలు అధికార పార్టీపై పోరాటానికి భయపడుతున్నాయి. మేము మాత్రం భయపడటం లేదు'' అని నాదెండ్ల అన్నారు.
''వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇన్ని రోజులు వేచి చూసారు..ఇంకొద్ది రోజులు వేచి చేస్తే స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా పోరాడతారో అందరూ చూస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి అన్యాయం జరగనివ్వం'' అని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.