చంద్రబాబుకు ధన్యవాదాలు ... ఎన్నికలకు ఎలా వెళ్లాలనేది ఒక్కరోజులో తేలదు: పవన్ వ్యాఖ్యలు
ఎన్నికలకు ఎలా వెళ్లాలనేది ఒక్కరోజులో తేల్చలేమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు, లెప్ట్ పార్టీలను కలుపుకొనిపోతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు
రాజకీయ పార్టీలు నడిపే వ్యక్తుల్నే నలిపేస్తామంటే ఎలా అంటూ ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యం బతకాలంటే రాజకీయ పార్టీలుండాలన్నారు. తమ మిత్రపక్షం బీజేపీ నేతలపైనా కేసులు పెట్టారని... ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి తిరుపతి లడ్డూలు ఇచ్చి ఇక్కడ నాయకులపై కత్తులతో పేగులు తీస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. మాపైనే అడ్డగోలు కేసులు పెడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని జనసేనాని ప్రశ్నించారు. వైసీపీ బారి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని... అందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు, లెప్ట్ పార్టీలను కలుపుకొనిపోతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇది ఎన్నికల అంశం కాదు.. ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన సమయమన్నారు.
ఎన్నికలకు ఎలా వెళ్లాలనేది ఒక్కరోజులో తేలే విషయం కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంపై ఆలోచించాల్సిన సమయం అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పక్షాలు, ప్రజలు, ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వైసీపీతో ఎలా పోరాడాలన్న దానిపై వ్యూహాలు మార్చుకోవాల్సి ఉందని, ఆ మేరకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నామని జనసేనాని తెలిపారు. కానీ తొలుత న్యాయ, రాజకీయ పోరాటం ఉంటుందని తెలిపారు.
ALso REad:తెలంగాణలో జనసేన పోటీపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఎన్ని స్థానాల్లో అంటే..?
అంతకుముందు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.... పవన్తో తన కలయిక ముందుగా అనుకున్నది కాదని... విమానాశ్రయం నుంచి వస్తూ పవన్ హోటల్లో వున్నారని తెలిసి నోవాటెల్కు వచ్చినట్లు చెప్పారు . విశాఖలో జరిగిన ఘటనలపై సంఘీభావాన్ని తెలియజేయడానికి పవన్ని కలిసినట్లు ఆయన తెలిపారు. విశాఖలో పవన్ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధ, ఆవేదన కలిగించాయని జనసేనాని అన్నారు. ఎయిర్పోర్ట్లో దిగిన నాటి నుంచి హోటల్కు వెళ్లేవరకు పవన్ను వేధించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోటాపోటీ సమావేశాలు వున్నప్పుడు పోలీసులు ప్లాన్ చేసుకోవాలని ఆయన హితవు పలికారు. వాళ్లపై వాళ్లే దాడులు చేసుకుని టీడీపీ, జనసేన కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నడిరోడ్డుపై పవన్ను నిలబెట్టి వేధించారని ఆయన ఫైర్ అయ్యారు. తప్పుడు కేసులు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని.. మీడియాకు కూడా స్వేచ్ఛ లేదన్నారు. రాజకీయ పార్టీల నేతలకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఏదని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రశ్నించే వాళ్లని వ్యక్తిగతంగా వేధిస్తున్నారని.... వైసీపీ లాంటి నీచమైన దారుణమైన పార్టీని నేనెక్కడా చూడలేదని ఆయన మండిపడ్డారు. ఏపీలో రాజకీయ పార్టీల మనుగడ కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.