విపక్షాలు ప్రభుత్వంపై  తప్పుడు  ప్రచారానికి తెర దించేందుకు  వైసీపీ  నూతన  కార్యక్రమానికి  శ్రీకారం చుట్టనుంది.  రేపటినుండి  జగనన్నే మా భవిష్యత్తు  కార్యక్రమాన్ని  వైసీపీ ప్రారంభించనుంది.

అమరావతి: రేపటి నుండి ఈ నెల 20వ తేదీ వరకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గురువారంనాడు ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటి కి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను గృహ సారధులు వివరించనున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కోటి 80 లక్షల మంది ఇళ్లను తమ ప్రతినిధులు కవర్ చేస్తారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు , తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.

దేశంలో ఎక్కడ అమలు కాని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలౌతున్నాయన్నారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 1.80 కోట్ల ఇళ్లను గృహ సారధులు సందర్శిస్తారని ఆయన వివరించారు. విపక్షాల విష ప్రచారానికి ఈ కార్యక్రమంతో తెరపడుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.

ఈ ఏడాది నిర్వహించే సంక్షేమ క్యాలెండర్ ను జగన్ ఇప్పటికే ప్రకటించారన్నారు. చంద్రబాబు సర్కార్ జన్మభూమి కమిటీలు జలగల్లా ప్రజలను పీడించాయని ఆయన విమర్శించారు.