సారాంశం

Jagan DA case: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అవినీతి కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి. ఇటీవలే జగన్‌ కేసుల విచారణలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థలైన (సీబీఐ), ఈడీపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో తాజాగా జగన్‌ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది. దీంతో వైసీపీలో ఆందోళనలు మొదలయ్యాయి. మరోవైపు ఒక్కొక్క కేసును బయటకు తీసి జగన్‌ను రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం చేస్తారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇక తాజాగా జరుగుతున్న పరిణామాలపై విశ్లేషణ కథనం. 

వైఎస్సార్‌ మరణం తర్వాత రాష్ట్రంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో జగన్‌ ఓదాప్పు చేపట్టడం.. దానికి కాంగ్రెస్‌ అడ్డుచెప్పడం.. అయినా లెక్కచేయకుండా జగన్‌ కొనసాగించడం వంటి ఘటనలు జరిగియి... ఈ నేపథ్యంలోనే ఆయన అక్రమాస్తులు కూడగట్టుకున్నారనే ఆరోపణలతో సీబీఐ కేసులు నమోదు చేయడంతో 16 నెలల పాటు జగన్‌, విజయసాయిరెడ్డి జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత బయటకు వచ్చి పార్టీ పెట్టడం 2019లో పార్టీ భారీ విజయం సాధించింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్‌ ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు. 



జగన్‌ అక్రమ ఆస్తులను ఒక్కొక్కటిగా

ప్రస్తుతం కూటమి పార్టీ అధికారంలో ఉండటంతో జగన్‌పై గతంలో పెట్టిన కేసులను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. దీనిలో భాగంగా ఈడీ ఫుల్‌ యాక్టివ్‌ అయ్యింది. జగన్‌ అక్రమ ఆస్తులను ఒక్కొక్కటిగా అటాచ్‌ చేస్తోంది. జగన్ అక్రమ ఆస్తులను కూడబెట్టుకున్నారనే ఆరోపణలపై ఆయన అరెస్టై 10 సంవత్సరాలకు పైగా అవుతోంది... ఇక జగన్‌పై సిబిఐ 11 చార్జిషీట్లు దాఖలు చేసింది, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) తొమ్మిది ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు చేసింది. అయితే వాటికి ఇప్పటికీ విచారణ చేయకపోవడంపై సుప్రీంకోర్టు దర్యాప్తు సంస్థలపై సీరియస్‌ అయ్యింది. ఈ నేపధ్యంలో అధికారులు యాక్టివ్‌ అయ్యారు. 

రూ.793 కోట్ల విలువైన ఆస్తులు ఈడీ అటాచ్‌..

ఆంధ్రప్రదేశ్‌ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను కేసులను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం బయటకు లాగుతోంది. జగన్‌ అక్రమాస్తుల కేసులో సుమారు రూ.793 కోట్ల విలువైన దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులు ఈడీ అటాచ్‌ చేసింది. వైఎస్సార్‌ హయాంలో కడప జిల్లాలోని సున్నపురాయి గనులను సుమారు 417 హెక్టార్ల వరకు దాల్మియా సిమెంట్స్‌కు అక్రమంగా లీజుకి ఇచ్చిందని సీబీఐ ఆరోపణలు చేసింది. దీనిలో జగన్‌ పాత్ర కీలకంగా ఉందని గుర్తించి సీబీఐ 2013లో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. దాల్మీయాకు లీజు ఇవ్వడం వల్ల జగన్‌ రూ.150 కోట్ల లబ్దిపొందారని సీబీఐ అధికారులు గుర్తించారు. 

 

వైసీపీ నాయకులు, క్యాడర్‌లో అలజడి..

దాల్మియా వారు జగన్‌కు ఇచ్చిన వాటాతోపాటు.. రఘురామ్‌ సిమెంట్స్‌కు రూ.95 కోట్ల విలువైన షేర్లు, రూ.55 కోట్లను హవాలా చెల్లించినట్లు అభియోగాలను సీబీఐ నమోదు చేసింది. వారి వివరాల ఆధారంగా సీబీఐ మనీలాండరింగ్‌ యాక్ట్‌ కింద.. ఈడీ ప్రస్తుతం దర్యాప్తు చేపట్టింది. తాజాగా రూ.793 కోట్ల విలువైన అస్తులను అటాచ్‌ చేసింది.. దీంతో వైసీపీ నాయకులు, క్యాడర్‌లో అలజడి మొదలైంది. జగన్‌ మరోసారి జైలుకు వెళ్తారా.. లేదా అతనిపై నేరం రుజువైనట్లు చూపి.. రాజకీయాల నుంచి దూరం చేయబోతున్నారా అన్నది సంచలనంగా మారింది.