జగన్ కేబినెట్ రికార్డుల మోత
అంతేకాదు జగన్ టీంలో అత్యధిక శాతం యువతే ఉండటం మరో విశేషం. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, పిల్లి సుభాష్ చంద్రబోస్ అంటే అయిదుగురు మినహా మిగిలిన వారంతా యువతే కావడం విశేషం.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏపీ కేబినెట్ సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంటుంది. ఏపీ చరిత్రలో 25 మంది ఒకేసారి మంత్రులుగా అవకాశం ఇస్తుండటం ఒక రికార్డు అయితే ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండటం మరో రికార్డు.
ఇవి రెండు ఒకటైతే జగన్ కేబినెట్ లో 19 మంది కొత్తవారే కావడం విశేషం. కేవలం ఆరుగురు మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన వారిలో ఉన్నారు. స్పీకర్గా ఎంపికైన తమ్మినేని సీతారాం గతంలో మంత్రిగా పనిచేశారు.
అలాగే విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, మోపిదేవి వెంకటరమణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు కూడా దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రులుగా పనిచేశారు.
ఇకపోతే శనివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారిలో కొడాలి నాని, ఆళ్ల నాని, పేర్ని నాని, అవంతి శ్రీనివాస్, తెల్లం బాలరాజు, మేకతోటి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, మేకపాటి గౌతమ్రెడ్డి, కన్నబాబు, పుష్పశ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్, ఆళ్ల రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత, శ్రీరంగనాథరాజులు కొత్తవారే.
వీరంతా గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినప్పటికీ మంత్రివర్గంలో ఏనాడు పనిచేయలేదు. వీరిలో కొడాలి నాని 4సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా మిగిలిన వారు రెండుసార్లు గెలుపొందిన వారే కావడం విశేషం.
అంతేకాదు జగన్ టీంలో అత్యధిక శాతం యువతే ఉండటం మరో విశేషం. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, పిల్లి సుభాష్ చంద్రబోస్ అంటే అయిదుగురు మినహా మిగిలిన వారంతా యువతే కావడం విశేషం. కేబినెట్ మినిస్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వీరు పనితీరులో పరుగెట్టిస్తారో చతికిలపడతారో వేచి చూడాలి మరి.