Asianet News TeluguAsianet News Telugu

ఆస్తిపన్నుపై జగన్ సర్కార్ డబుల్ షాక్...ఏప్రిల్ 1నుంచే వర్తింపు...

ఏపీలో ఆస్తిపన్ను పెంపుపై ప్రభుత్వం భారీ షాకిచ్చింది. గతేడాది నుంచే ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనలు మొదలైనా వీటిపై అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం వాయిదా వేస్తున్నట్లు నమ్మించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ కొత్త ఆస్తిపన్ను పెంపుపై ప్రజల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతుండటం, విపక్షాల నిరసనలతో పెంపుపై నిర్ణయం తీసుకునేందుకు జంకింది.

jagan regime double shock on property tax huge percentage of hike and implemented from april 1
Author
Hyderabad, First Published Aug 27, 2021, 12:53 PM IST

ఏపీలో ఆస్తిపన్నుపై వైసీపీ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఆస్తిపన్ను పెంపుపై ఈ ఏడాది నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కరోనా కారణంగా దీని అమలును వాయిదా వేసినట్లు అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఏమాత్రం కనికరం లేకుండా పెంచిన పన్ను ఏప్రిల్ 1నుంచే వర్తిస్తుందని నోటీసులు జారీ చేస్తోంది. ఇందులో భాగంగానే పట్టణ స్థానిక సంస్థలు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. దీంతో పన్ను చెల్లిపుదారులు గగ్గోలు పెడుతున్నారు. ఆస్తిపన్ను పెంపుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రభుత్వం లెక్కచేయలేదని దీన్ని బట్టి తెలుస్తోంది.

ఏపీలో ఆస్తిపన్ను పెంపుపై ప్రభుత్వం భారీ షాకిచ్చింది. గతేడాది నుంచే ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనలు మొదలైనా వీటిపై అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం వాయిదా వేస్తున్నట్లు నమ్మించింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనూ కొత్త ఆస్తిపన్ను పెంపుపై ప్రజల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతుండటం, విపక్షాల నిరసనలతో పెంపుపై నిర్ణయం తీసుకునేందుకు జంకింది. కానీ సరైన సమయం చూసి పన్ను పెంపు నిర్ణయాన్ని బయటపెట్టింది. దీంతో ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు గగ్గోలు పెడుతున్నారు.

ఏపిలో ఆస్తిపన్ను పెంపుపై ప్రభుత్వం రోజుకో మాట మాట్లాడుతుండటంతో ఇప్పట్లో పెంపు ఉండబోదని అంతా భావించారు. పెంచినా ఎప్పటి నుంచి పెంచితే అప్పటి నుంచే కట్టాల్సి ఉంటుందని అనుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇలాంటి వారందరికీ ఒకేసారి షాకిచ్చింది. ఏప్రిల్ 1నుంచే అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదలైన నాటి నుంచే ఆస్తిపన్ను పెంపు వర్తిస్తుందని తాజాగా నోటీసులు జారీ చేస్తోంది.

అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆస్తిపన్ను పెరిగినట్లు ఇందులో పేర్కొంటున్నారు. ఈ మేరకు పట్టణ స్థానిక సంస్థలైన నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. 

వాస్తవానికి పట్టన స్థానిక సంస్థలో ఆస్తిపన్ను పెంపుపై ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే డిమాండ్ నోటీసులు జారీ చేస్తారు. వీటి ఆధారంగా ప్రజలు పన్నుల చెల్లింపు పూర్తి చేస్తారు. కానీ ఇప్పుడు ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి అంటే ఏప్రిల్ 1నుంచి ఆస్తిపన్ను పెంచినట్లు ఇప్పుడు నోటీసులు జారీ చేయాల్సి రావడంతో.. ప్రభుత్వం మరో స్పెషల్ నోటీసులు జారీ చేస్తోంది.

ఇందులో గతంలో ఆర్థిక సంవత్సరం ఆరంభంలో జారీ చేసిన నోటీసుల ప్రకారం పన్ను చెల్లించి ఉంటే దాన్ని మినహాయించి మిగిలిన పన్ను చెల్లించేలా ఈ స్పెషల్ నోటీసుల జారీ ప్రారంభించారు. సెప్టెంబర్ చివరి నాటికి ఈ నోటీసుల జారీ పూర్తవుతుందని తెలుస్తోంది. 

ఇప్పటివరకు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో వార్షిక అద్దె విలువ ఆధారంగా ఆస్తిపన్ను లెక్కించేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆయా ఆస్తుల విలువ, రిజిస్ట్రేషన్ ధరల ఆధారంగా ఆస్తిపన్ను నిర్ణయిస్తోంది. గతంలో వార్షిక అద్దె విలువ ఆయా ఇళ్ల పరిస్థితి, నమూనా ఆధారంగా నిర్ణయం అయ్యేది. కానీ ఇప్పుడు మార్కెట్లో దానికి ఉన్న విలువ, రిజిస్ట్రేషన్ ధర ఆధారంగా నిర్ణయం కాబోతోంది.

అందుకే దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పన్నుపెంపే ఓ షాక్ అంటే దాన్ని మదింపు విధానం కూడా మారడం డబుల్ షాక్ కానుంది. దీంతో గతంతో పోలిస్తే భారీగా ఆస్తిపన్ను పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విధానం అమలైతే భవిష్యత్తులో పెరిగే రిజిస్ట్రేషన్ ధరలు, భూముల విలువలు కూడా కచ్చితంగా ఆస్తిపన్నును నిర్ణయించడం ఖాయంగా తెలుస్తోంది.

ఏపీలో ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదనలు రాగానే రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు అన్ని పట్టణాలు, నగరాల్లో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలు తెలిపారు. మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో విపక్షాలు నిరసనలు తెలిపాయి. బయట కూడా ఆందోళనలు జరిగాయి. అయినా ప్రభుత్వం వీటిని ఏమాత్రం పట్టించుకోలేదని ఆస్తిపన్ను పెంపుపై జారీ చేస్తున్న తాజా నోటీసులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో తాజా నోటీసులపై మరోసారి ఆందోళనలకు వీరు సిద్ధమవుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios