చంద్రబాబు ఓటుకు రూ. 5 వేలు పంచుతారట...
- నంద్యాల ఉపఎన్నికలో చంద్రబాబునాయుడు ఓటుకు రూ. 5 వేలు పంచబోతున్నారా?
- వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అలాగనే ఆరోపిస్తున్నారు.
- రాష్ట్ర జనాభాలో సగటున ఒక్కొక్కరి నుండి చంద్రబాబు రూ. 60 దోచుకున్నట్లు లెక్కలు చెప్పారు.
నంద్యాల ఉపఎన్నికలో చంద్రబాబునాయుడు ఓటుకు రూ. 5 వేలు పంచబోతున్నారా? వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అలాగనే ఆరోపిస్తున్నారు. గురువారం రెండో రోజు రోడ్డు షోలో మాట్లాడుతూ, గడచిన మూడున్నరేళ్ళలో చంద్రబాబు దోచుకున్న రూ. 3.5 లక్షల కోట్లు దోచుకున్నట్లు ఆరోపించారు. అంటే రాష్ట్ర జనాభాలో సగటున ఒక్కొక్కరి నుండి చంద్రబాబు రూ. 60 దోచుకున్నట్లు లెక్కలు చెప్పారు. అయితే ఒక్కోరినుండి దోచుకున్న మొత్తంలో నుండి ఉపఎన్నికలో తిరిగి రూ. 5 వేలు ఖర్చు పెట్టటానికి సిద్ధపడుతున్నట్లు మండిపడ్డారు.
'రానున్న రోజుల్లో చంద్రబాబునాయుడు డబ్బుల మూటలతో వస్తారట. ఓటర్ల దగ్గరకు వచ్చి డబ్బులు చేతులో పెడతారట. దాంతో పాటు తన జేబులో నుంచి దేవుడి పటం తీసి, తనకే ఓటు వేయాలంటూ మీ అందరితో ప్రమాణం చేయించుకుంటార’ని జగన్ ఎద్దేవా చేసారు. ఓటు వేయటం కోసం డబ్బు తీసుకోవటం పాపమని జగన్ చెప్పారు. ‘ఏ దేవుడు కూడా పాపం చేయమని చెప్పడని పాపం చేయమని సైతాన్, దెయ్యం మాత్రమే చెబుతాయ’న్నారు. అంటే డబ్బు పంచే వాళ్ళని జగన్ దెయ్యాలఃతో పోల్చారు.
అయితే, అదే సమయంలో జగన్ ఓటర్లకు ఓ సలహా కూడా ఇచ్చారు లేండి. ‘మీ దగ్గరకు వచ్చి చేతుల్లో డబ్బులు పెట్టి ప్రమాణం చేయమన్నప్పుడు ఆ దెయ్యాలతో గొడవ పడద్ద’న్నారు. ‘ధర్మం వైపే అంతా నిలబడతామని మనస్సులో దేవుడిని తలుచుకొని లౌక్యంగా వాళ్లు చేసే దుర్భుద్ధిని, దుర్నీతిని తిప్పికొట్టండి' అని జగన్ ఓటర్లకు సూచించారు. అంత వరకూ బాగానే ఉంది. మరి చంద్రబాబు చేస్తాడని చెబుతున్న పనినే వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి కూడా చేస్తే ఓటర్లు అప్పుడేం చేయాలి?