మీడియాపై ఆంక్షలు: జగన్ కు ఎడిటర్స్ గిల్డ్ షాక్!
జగన్ సర్కార్ మీడియా పై ఆంక్షలు విధించేందుకు పాస్ చేసిన జీవో నెంబర్ 2430 పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు సెన్సార్షిప్ తోని సమానమని వారు అన్నారు.
మీడియా సంస్థల గొంతు నొక్కడానికి జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ను తక్షణం ఉపసంహరించుకోవాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. కేసులు నమోదు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు అధికారాలు ఇవ్వడంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉత్తర్వును తక్షణం ఉపసంహరించుకోవాలని కోరింది.
"రాష్ట్ర ప్రభుత్వంలోనిఇలా ఉన్నతాధికారులకు ఇబ్బడి ముబ్బడి అధికారాలు ఇవ్వడం వల్ల అధికార దుర్వినియోగం అయ్యే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి విచక్షణారహిత్యమైన చట్టం వల్ల మీడియా స్వేచ్ఛకు తీవ్ర నష్టం కలుగుతుంది" అని గిల్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్టోబర్ 30 న ఈ ఉత్తర్వును జారీ చేసింది. ఇంతకుముందు, కేవలం సమాచార కమిషనర్లు మాత్రమే ఇలా కంప్లయింట్లు ఫైల్ చేసే అధికారాన్ని కలిగి ఉండేవారు. కానీ ఇప్పుడు అందరు డిపార్ట్మెంట్ సెక్రటరీలు ఇలా కంప్లయింట్లను ఫైల్ చేసే అధికారాన్ని కలిగి ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల విభాగం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, డిపార్ట్మెంట్ సెక్రటరీలు “రీజాయిండర్లు జారీ చేయవచ్చు, ఫిర్యాదులు దాఖలు చేయవచ్చు, తగిన కేసులు పెట్టవచ్చు, అవసరమైతే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా చట్టాన్ని అనుసరించి కేసులు పెట్టవచ్చు.
ఎడిటర్స్ గిల్డ్ ప్రకటన ఈ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది, ఇది "మీడియా పనితీరును తీవ్రంగా దెబ్బతీస్తుంది" అని పేర్కొంది.క్రిమినల్ డిఫమేషన్ కేసులు ఇంతకుముందు వ్యక్తులకు మాత్రమే పరిమితమయ్యాయని, ఇప్పుడు ఇలా మీడియా మీద కూడా ప్రభుత్వాలు పెట్టడం ఒక రకంగా సెన్సార్షిప్ కిందకు వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేసారు.
"ఇలా రాష్ట్రం తనకున్న అపరిమిత వనరులతో ఇలా క్రిమినల్ డిఫమేషన్ కేసులు పెట్టడం ఖచ్చితంగా సెన్సార్షిప్పే అవుతుందని వ్యాఖ్యానించింది.
చాలా మంది జర్నలిస్టులు, రాజకీయ నాయకులు ఈ చర్యను ఖండించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది. ప్రధాన కార్యదర్శి, స్పెషల్ కమిషనర్ (ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్) కు నోటీసులను జారీ చేసింది.
ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ నాయకుడు ఎన్. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ చర్య భావ ప్రకటనా స్వేచ్ఛను హరించివేస్తుందని, ఈ చర్య సోషల్ మీడియాలో ప్రజల గొంతును నొక్కివేయడానికి ఉద్దేశించబడిందని జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.