Asianet News TeluguAsianet News Telugu

సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులన్నీ సక్రమమైనవే.. తేల్చేసిన ఐటీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌

సుదీర్ఘకాలం విచారించి, ఇరుపక్షాల వాదనలు సమగ్రంగా విన్న తర్వాత గత నెల 23న బెంచ్ 153 పేజీల ఉత్తర్వులను వెలువరించింది. అప్పటి ఐటీ అధికారి ఇచ్చిన ఉత్తర్వులు చెల్లదంటూ.. అందులో పేర్కొన్నట్లుగా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

IT appellate tribunal clarifies about investments made sakshi media
Author
Hyderabad, First Published Jan 13, 2022, 9:21 AM IST

హైదరాబాద్ : sakshi mediaలోకి వచ్చిన investments అన్నీ సక్రమమైనవి, చట్టబద్దమైనవేనని IT appellate tribunal స్పష్టమయింది. జగతి పబ్లికేషన్స్లో  ఇన్వెస్టర్లంతా చట్టానికి లోబడే పెట్టుబడులు పెట్టారని,  ఇన్వెస్ట్మెంట్ల స్వీకరణ లో కంపెనీలు చట్టప్రకారం పాటించాల్సిన నిబంధనలు అన్నింటిని జగతి పబ్లికేషన్స్ పాటించిందని Income Tax Department అప్పిలేట్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ కంపెనీలోకి పెట్టుబడులన్నీ  Quid Pro Co రూపంలో వచ్చాయి... కనుక వాటిని ఆదాయంగా పరిగణించి,  ఆ మొత్తంపై పన్ను చెల్లించాలంటూ  2011లో నాటి ఐటీ అధికారి ఇచ్చిన నోటీసులను ఐటీఏటీ కొట్టివేసింది.

ఐటీ విభాగం తన వాదనకు మద్దతుగా సమర్పించిన CBI chargesheet ను.. అసలు సాక్ష్యంగానే పరిగణించలేమని తెగేసి చెప్పింది. సాక్ష్యానికి ఉండాల్సిన కనీస లక్షణాలు ఏవీ ఆ చార్జిషీటు లేవని కూడా బెంచ్ వ్యాఖ్యానించింది. ‘ఆ చార్జిషీట్లలో ఉన్నవన్నీ సీబీఐ చేసిన ఆరోపణలే తప్ప.. నిరూపితమైనవేమీ కావు. అయినా మీరు నోటీసులిచ్చిన అసెస్మెంట్ ఇయర్ ఇప్పటికి పదేళ్లు గడిచింది. మీరేమైనా దర్యాప్తు చేశారా?  క్విడ్ ప్రో కో ఆరోపణలు నిరూపించే ఆధారాలు సంపాదించారా?  సీబీఐ ఆరోపణలనే సాక్ష్యంగా  సమర్పిస్తే ఎలా?  సి.బి.ఐ చార్జిషీట్లకు ఎలాంటి హేతుబద్ధతా లేదు. ఈ కేసులో అవి అనవసరం.. అప్రస్తుతం కూడా.’ అని జుడిషియల్ అకౌంటింగ్ సభ్యులతో కూడిన ట్రిబ్యునల్ బెంచ్ తేల్చిచెప్పింది.  

తద్వారా సాక్షి మీడియాలోకి వచ్చిన పెట్టుబడులపై పదేళ్లుగా టీడీపీ అధినేత Chandrababu Naidu, ఆయన గ్యాంగ్ లోని ఎల్లోమీడియా పనిగట్టుకుని చేసిన దుష్ప్రచారానికి  తెర వేసినట్లయింది. సుదీర్ఘకాలం విచారించి, ఇరుపక్షాల వాదనలు సమగ్రంగా విన్న తర్వాత గత నెల 23న బెంచ్ 153 పేజీల ఉత్తర్వులను వెలువరించింది. అప్పటి ఐటీ అధికారి ఇచ్చిన ఉత్తర్వులు చెల్లదంటూ.. అందులో పేర్కొన్నట్లుగా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ప్రీమియాన్ని ఆదాయం  అంటారా?  
2008-09 అసెస్మెంట్ సంవత్సరంలో సాక్షి మీడియా గ్రూప్ కు చెందిన జగతి పబ్లికేషన్స్లో పలువురు ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు ఇన్వెస్ట్ చేశారు. పది రూపాయల ముఖ విలువ గల షేరుకు రూ. 350 ప్రీమియం చెల్లించి కొనుగోలు చేశారు. ఈ ప్రీమియం రూపంలో వచ్చిన రూ.277 కోట్లను ఆదాయంగా పేర్కొంటూ.. దానిపై పన్ను చెల్లించాలని 2011లో నాటి It అధికారి  సంస్థకు  నోటీసులు ఇచ్చారు.  జగతి సంస్థ దాన్ని సవాలు చేసింది.  వివిధ విచారణల అనంతరం అది ఇప్పుడు ట్రిబ్యునల్ ముందుకు వచ్చింది.

షేర్ లను విక్రయించడం ద్వారా సమీకరించిన పెట్టుబడిని ఏ కంపెనీ అయినా మూలధనంగా పరిగణిస్తుంది. కానీ... ఆ ముఖ విలువ రూపంలో స్వీకరించిన షేర్ కు రూ. 10ని మాత్రం చట్టబద్ధమైనదిగా.. సక్రమమైనదిగా పేర్కొన్న ఐటీ అధికారి... ఆయా ఇన్వెస్టర్లకు ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులు కట్టబెట్టిందని, అందుకే వారు అంత ప్రీమియాన్ని ఇన్వెస్ట్ చేశారని,  క్విడ్ప్రోకో రూపంలో వచ్చిన ప్రీమియాన్ని ఆదాయంగా పరిగణించాలని ఐటీ అధికారి  పేర్కొనడాన్ని బెంచ్ తప్పు పట్టింది. దీనికి సాక్ష్యంగా ప్రత్యేక కోర్టులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లను తమకు సమర్పించడాన్ని కూడా బెంచ్ ఆక్షేపించింది.  

‘షేర్ ముఖ విలువ రూపంలో వచ్చిన సొమ్ము సహేతుకమే అంటున్నారు. దానిపై ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయడం లేదు. జగతి సంస్థ కార్యకలాపాల విషయంలోనూ ఎలాంటి అభ్యంతరాలూ లేవు. వారి అభ్యంతరమల్లా షేర్ ప్రీమియంపై మాత్రమే’ అంటూ ఒక కంపెనీ పెట్టిన మొత్తంలో కొంత సక్రమం, మరికొంత అక్రమం ఎలా అవుతుందని బెంచ్ ప్రశ్నించింది.  దీన్ని ఇంకోలా చూద్దామంటూ…  ‘ఓకే కంపెనీ.. ముఖ విలువ పెట్టినప్పుడేమో సక్రమమైనది. షేర్ ప్రీమియం విషయంలో మాత్రం సక్రమం కాకుండా పోతుందా? ఒకే కంపెనీ విషయంలో అధికారి ఇలా రెండు రకాలుగా ఎలా ఆలోచిస్తారు? కాబట్టి రూ.277 కోట్లు పెట్టుబడిగానే  వచ్చిందని, ఆదాయం కాదని  మేం భావిస్తున్నాం’ అని బెంచ్ తేల్చిచెప్పింది.

ఒక్కొక్కరికి ఒక్కో‘లా’ ఎలా?
‘కొందరు ఇన్వెస్టర్ల విషయంలో ఇదే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. వారి విషయంలో ఎలాంటి క్విడ్ప్రోకో లావాదేవీలు జరగలేదని స్పష్టం చేసింది.  కానీ మిగతా ఇన్వెస్టర్ల విషయంలో క్విడ్ప్రోకో జరిగిందని కూడా  ఆ మెమోలో చెప్పలేదు.  మరి క్విడ్ప్రోకో అని అని మీరు ఎలా అంటారు?’  అని బెంచ్ తన ఉత్తర్వుల్లో ఐటీ విభాగాన్ని ప్రశ్నించింది.  ప్రైవేట్ లిమిటెడ్ లో షేర్ ప్రీమియం అనేది ఇన్వెస్టర్లతో జరిగే చర్చలు, వారి అంచనాల వల్లే నిర్ణయం అవుతుందని పేర్కొంది.

వాల్యుయేషన్ నివేదిక నిజమేనా?
 పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్లకు వాల్యుయేషన్ నివేదిక  చూపించారని, ఆ నివేదికలు కంపెనీ వేసిన అంచనాలు, కంపెనీ ఇచ్చిన సమాచారం మేరకే రూపొందించారని, అవి సరైనవి కావని ఐటీ విభాగం పేర్కొంది. దాని ప్రకారం షేర్ ప్రీమియాన్ని నిర్ణయించడం సరికాదు అన్న  వాదనతో బెంచ్ ఏకీభవించలేదు.

‘వాల్యుయేషన్ రిపోర్టును అసలు తప్పు పట్టడానికి లేదు. అందులో పేర్కొన్న అంచనాలన్నీ సాక్షి పత్రిక విషయంలో నిజమయ్యాయి. అనుకున్నట్టుగానే సర్క్యులేషన్ పెరిగింది. పోటీ పత్రిక ఈనాడు గుత్తాధిపత్యం తగ్గింది.  పోటీ పత్రిక 30 ఏళ్లలో సాధించిన సర్కులేషన్ ను సాక్షి ఏడాదిన్నర లోనే సాధించింది. కనుక వాల్యుయేషన్ నివేదికను తప్పు పట్టలేం. సాక్షి యాజమాన్యానికి అనుభవం లేకున్నా.. అంత ప్రీమియం తీసుకున్నారన్న నా వాదన అర్ధరహితం. వారి  లీడర్షిప్ లో ఆ పత్రిక అంచనాలు అన్నింటిని అందుకుంది. కాబట్టి క్విడ్ప్రోకో వాదనకు అర్ధమేలేదు’  అని బెంచ్ పేర్కొంది
 
ఇన్వెస్టర్ల వాదనను గమనించారా?
సాక్ష్యాలుగా సమర్పించిన పలు వాదనల్లో నిమ్మగడ్డ గ్రూపు సంస్థ డైరెక్టరు నిమ్మగడ్డ ప్రకాష్ చేసిన వాదనను బెంచ్ ప్రస్తావించింది. ‘ఈనాడులో పెట్టుబడుల కోసం బ్లాక్స్టోన్ అనుకున్న విలువలో 20% డిస్కౌంట్ కే సాక్షిలో వాటా దొరికింది. ఐదు ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెడదామని అనుకున్నాం. అందులో మీడియా ఒకటి. అందుకే సాక్షిలో పెట్టాం’ అనే వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకోవాలని బెంచ్ వ్యాఖ్యానించింది.  వచ్చిన పెట్టుబడులు షేర్ ముఖ విలువ రూపంలో వచ్చాయా?  ప్రీమియం రూపంలోనా?  అనేది అప్రస్తుతమని, అది ఆదాయమా? కాదా? అన్నదే ప్రశ్న అని.. ఆదాయంగా పరిగణించ లేదని విస్పష్టంగా తేల్చి చెప్పింది

తెలియని మార్గాలంటే ఎలా?
కోల్కతా లోని కొన్ని కంపెనీల నుంచి వచ్చిన పదిహేను కోట్లను తెలియని మార్గాల నుంచి వచ్చిన మొత్తంగా ఐటీ విభాగం పేర్కొంది. దాన్ని బెంచ్ తప్పుపడుతూ కోల్కతా కంపెనీలతో సహా పెట్టుబడి ప్రతి కంపెనీకి సంబంధించిన పాన్, రిజిస్ట్రేషన్ నెంబర్, అడ్రస్ వంటి వివరాలన్నీ జగతి సంస్థ సమర్పించిందని,  అన్ని చట్టబద్ధంగానే ఉన్నప్పుడు ‘గుర్తుతెలియని ఆదాయం’ ఎలా అవుతుంది అని ప్రశ్నించింది.

Follow Us:
Download App:
  • android
  • ios