ఏపీ, తెలంగాణ నుంచే యుద్ధ పీడిత సూడాన్ కు ‘ఐఎస్ఐఎస్ డ్రగ్’ స్మగ్లింగ్.. ఏమిటా డ్రగ్, దానిని ఎందుకు వాడుతారంటే ?
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వాడే ట్రామాడోల్ డ్రగ్ తెలంగాణ, ఏపీ నుంచి ఎగుమతి అవుతోందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవల సూడాన్ కు ఈ ఔషధాన్ని ఎగుమతి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కంపెనీ డైరెక్టర్ ను ముంబైలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు.
![ISIS drug smuggling from AP and Telangana to war-torn Sudan.. What is the drug and why is it used?..ISR ISIS drug smuggling from AP and Telangana to war-torn Sudan.. What is the drug and why is it used?..ISR](https://static-ai.asianetnews.com/images/01eyqvv2gs2s34hrqfn44p4hye/gettyimages-689227195-170667a-jpg_363x203xt.jpg)
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఎక్కువ సేపు మేల్కొని ఉండటానికి ‘ట్రామాడోల్’ అనే నొప్పిని తగ్గించే ఓపియేట్ ను ఉపయోగిస్తారు. ఇది సూడాన్ సహా యుద్ధ బాధిత దేశాలకు అక్రమంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని తయారీదారులు అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనంలో పేర్కొంది. మార్కెట్ లో ‘ఐఎస్ఐఎస్ డ్రగ్’ అని కూడా పిలిచే ఆ మందు అలసటతో పోరాడటానికి సహాయపడుతుంది.
ఇటీవల సూడాన్ కు ఈ ఔషధాన్ని ఎగుమతి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కంపెనీ డైరెక్టర్ ను ముంబైలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. 2022-23లో ఆంధ్రా, తెలంగాణ నుంచి ఈ డ్రగ్ అక్రమ ఎగుమతికి సంబంధించి రెండు కేసులు నమోదైనట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారి ఒకరు తెలిపారు. ఎగుమతులను నిరోధించడానికి, ట్రామాడోల్ ను సూడాన్ లోకి స్మగ్లింగ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన సేఫ్ ఫార్మాస్యూటికల్స్ కు నోటీసులు ఇవ్వాలని ఫార్మాస్యూటికల్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మాక్సిల్) నిర్ణయించింది.
భారత్ పై జర్మనీ అక్కసు.. జనాభా పెరుగుదలను చూపిస్తూ వ్యంగ్యంగా కార్టూన్.. మండిపడుతున్న నెటిజన్లు
ఈ స్మగ్లింగ్ వల్ల భారత ఫార్మా పరిశ్రమకు చెడ్డపేరు వస్తోందని ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ ఆర్ ఉదయ్ భాస్కర్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తో తెలిపారు. రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లు అక్రమ తయారీ యూనిట్లు, లెక్కల్లోకి రాని ఎగుమతులు, స్మగ్లింగ్ పై నిఘా ఉంచాలని ఆయన తెలిపారు. వాస్తవానికి కేంద్రం ఈ ఏడాది ఆగస్టు నుండి ట్రేసబిలిటీ వ్యవస్థను అమలు చేస్తుంది. దీని ద్వారా ఒక డ్రగ్ ఉత్పత్తి నుంచి చివరి రిటైలర్ కు చేరే వరకు దానిని ట్రాక్ చేసేందుకు వీలుంటుంది.
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) స్మగ్లింగ్ నివేదిక ప్రకారం.. 2019-20లో 22 టన్నుల ట్రామాడోల్, 2020-21లో 152 టన్నుల ట్రామాడోల్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యవర్తిత్వ దేశాల ద్వారా ట్రామాడోల్ ను పాకిస్తాన్ కు ఎగుమతి చేసినందుకు 2022 మార్చిలో ఎన్సీబీ ఓ ఫార్మా కంపెనీ ప్రమోటర్లను అరెస్టు చేసింది.