వైసిపిలోకి కాటసాని ?
కర్నూలు జిల్లాకు చెందిన పాణ్యం మాజీ ఎంఎల్ఏ కాటసాని రాంభూపాల్ రెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బిజెపిలో ఉన్నప్పటికీ కాటసాని పరిస్ధితి ఏమంత ప్రోత్సాహకంగా లేదు.
దాంతో పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా ఉత్సాహంగా పాల్గొనటం లేదు.
పైగా రాష్ట్రంలో బిజెపి పరిస్దితి కూడా ఆశాజనకంగా లేదు. అందుకనే బిజెపిలో ఉండేకన్నా వైసిపిలో చేరితేనే మంచిదని మద్దతుదారులు కూడా పట్టుబడుతున్నారు.
రాంభూపాల్ రెడ్డి వ్యవహారాలు జాగ్రత్తగా గమనిస్తున్న బిజెపి నేతలు కూడా కాటసాని ఎప్పుడో ఒకపుడు వైసిపిలోకి వెళ్ళిపోవటం ఖాయమనే నిర్ణయాయినికి వచ్చారు.
పాణ్యం నుండి ఐదుసార్లు ఎంఎల్ఏగా గెలిచిన కాటసానికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అయితే, పోయిన ఎన్నికల్లో కాటసాని స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేశారు.
వైసిపి అభ్యర్ధిగా పోటీ చేసిన గౌరు చరితారెడ్డి చేతిలో సుమారు 12 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గౌరుకు సుమారు 72 వేల ఓట్లు వస్తే కాటసానికి 60 వేల ఓట్లు వచ్చాయి. దాంతోనే కాటసానికి నియోజకవర్గంలో ఉన్న పట్టేంటో అర్ధమవుతోంది.
వచ్చే ఎన్నికల్లో చరితారెడ్డి పోటీ చేసేది అనుమానమే అంటున్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న చరిత పోటీపై అంత సుముఖంగా లేరట. భర్త గౌరు వెంకట్రెడ్డి ఉన్నప్పటికీ ఆయనకు ఎంఎల్సీ పదవి ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.
అందుకనే కాటసానిని చేర్చుకుంటే పార్టీ కూడా బలోపేతమవుతుందని వైసిపి వర్గాలు కూడా సానుకూలంగా ఉన్నాయట. ఈనెలాఖరులోగా జగన్మోహన్ రెడ్డితో కాటసాని భేటీ అయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలంటున్నాయ్.
పాణ్యంలో టిక్కెట్టు ఇవ్వటానికి జగన్ అంగీకరిస్తే కాటసాని వైసిపిలో చేరటం ఖాయమే.