ఈనెల 26వ తేదీన విశాఖపట్నం ఆర్కె బీచ్ లో పవన్ మౌనదీక్షకు కూర్చునే అవకాశం ఉంది.

ప్రత్యేకహోదా సాధన కోసం పవన్ కల్యాణ రోడ్డెక్కనున్నారా? జనసేన వర్గాలు చెబుతున్నదాని ప్రకారం ఈనెల 26వ తేదీన విశాఖపట్నం ఆర్కె బీచ్ లో పవన్ మౌనదీక్షకు కూర్చునే అవకాశం ఉంది. తమిళనాడులో జల్లికట్టు నిర్వహణకు ప్రజలు, రాజకీయపార్టీలు, సినీ తదితర రంగాలు ఏకమైన విధానం పవన్ను బాగా ఆకట్టుకున్నట్లే ఉంది. ఇపుడు ఏపిలో కూడా వివిధ రంగాల్లోని ప్రముఖులను ఎందుకు ఏకం చేయకూడదని పవన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇప్పటికే ప్రత్యేకహోదా డిమాండ్ తో పవన్ రాష్ట్రంలో తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, అనంతపురలో బహిరంగ సభలు కూడా నిర్వహించారు. పై సభలన్నింటిలోనూ జనసేన అభిమానులతో పాటు సినీ అభిమానులు, సామాజిక వర్గంలోని యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదే రీతిలో 26వ తేదీన ఆర్కె బీచ్ లో మొదలవ్వనున్న హోదా ఉద్యమంలో కూడా తన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పవన్ భావిస్తున్నారు.

అందుకు ముందుగా తానే 26న మౌనదీక్ష చేస్తే ఎలాగుంటుందని యోచిస్తున్నారు. ఒకవేళ తాను గనుక ఒక్కరోజు మౌనదీక్షలో పాల్గొంటే సినిరంగంలోని పలువురు ప్రముఖులు కూడా పవన్ కు మద్దతు పలికే అవకాశాలున్నాయి. అప్పుడు హోదా పోరుకు కాస్త ఊపువచ్చే అవకాశాలున్నాయి. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా జరుగుతున్న అవకాశవాద, విభజన, నేరపూరిత రాజీకాయలకు వ్యతిరేకంగా రూపొందించిన ఓ మ్యూజిక్ ఆల్బమ్ ను 24వ తేదీన విడుదల చేయనున్నట్లు పవన్ ట్విట్టర్లో వెల్లడించారు. దాంతో పవన్ మౌనదీక్షపై సర్వత్రా ఉత్కంఠ మొదలైంది.