సొంత జిల్లాలో ‘దేశం’ ఇలా ఉందా?
వివిధ నియోజకవర్గంలోని లోపాలను ఎంఎల్ఏలు, ఇన్చార్జిలకు ఎత్తి చూపారు. లోపాలను చెప్పటంతో పాటు వాటిని సవరించుకోకపోతే తానేం చేయలేనని కూడా స్పష్టం చేసారు. నేతల మైనస్ లను తాను భరించలేనని హెచ్చరిచారు.
సొంత జిల్లాలోని నియోజకవర్గాల్లోనే ఇన్ని లోపాలుండటం దేనికి నిదర్శనం? చిత్తూరు జిల్లా నేతలతో చంద్రబాబునాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ నియోజకవర్గంలోని లోపాలను ఎంఎల్ఏలు, ఇన్చార్జిలకు ఎత్తి చూపారు. లోపాలను చెప్పటంతో పాటు వాటిని సవరించుకోకపోతే తానేం చేయలేనని కూడా స్పష్టం చేసారు.
నేతల మైనస్ లను తాను భరించలేనని హెచ్చరిచారు. సమీక్ష ప్రకారం నియోజకవర్గాల్లోని ఎంఎల్ఏల, నేతల నేతలు పరిస్ధితి అంత బావున్నట్లు లేదు. పార్టీ వర్గాల ప్రకారం సమీక్ష వివరాలు క్లుప్తంగా ఇలా ఉన్నాయి.
చిత్తూరు నియోజకవర్గంలో ఎంఎల్ఏ సత్యప్రభకు మరిది నుండి సమస్యలు ఎదురవుతున్నాయి. నియోజకవర్గంలో బలిజ-కమ్మ సామాజిక వర్గాల మధ్య సమస్యలున్నాయి. అవి సర్దుబాటు చేసుకోలేకపోతే కష్టమన్నారు. ముక్కుసూటిగా పోవటం వల్ల పుంగనూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ రాజుకు సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పారు.
మదనపల్లిలో నేతలెక్కువైపోవటం సమస్యలు వస్తున్నట్లు వ్యాఖ్యానించారు. కాబట్టే పార్టీ కార్యక్రమాలను ఎవరు పట్టించుకోవటం లేదని అసంతృప్తి వ్యక్తం చేసారు. తంబళ్ళపల్లె ఎంఎల్ఏకు బెంగుళూరులో వ్యాపారాలుండటం వల్ల ప్రజల అవసరాలకు అందుబాటులో ఉందటం లేదు. దాంతో జనాలకు, ఎంఎల్ఏకు గ్యాప్ వచ్చేస్తోంది. వెంటనే నియోజకవర్గంలో ఉండకపోతే వచ్చే ఎన్నికల్లో కష్టమని తేల్చిచెప్పారు.
పీలేరులో ప్రయోగాలు చేయదలచుకోలేదని ఇన్ఛార్జ్ ఇక్బాల్ తో సిఎం చెప్పారు. ఇలా ప్రయోగాలు చేసే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకు కారణమైనట్లు గుర్తుచేసుకున్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలో కూడా మొదటి నుండి చంద్రబాబు అసంతృప్తిగానే ఉన్నారు. నేరుగా మాట్లాడుతానని గల్లా అరుణకుమారి అనటంతో సమీక్షను వాయిదా వేసారు. తిరుపతిలో ఎంఎల్ఏ కన్నా అల్లుడి జోక్యం ఎక్కువైపోయిందన్నారు. జోక్యాన్ని నియంత్రించకపోతే కష్టమేనని స్పష్టంగా చెప్పారు.
సరే, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గైర్హాజరుతో శ్రీకాళహస్తి సమీక్ష జరగలేదు. సత్యవేడు ఎంఎల్ఏ ఆదిత్యతో మాట్లాడుతూ, తండ్రి జోక్యం ఎక్కువైపోయిన కారణంగా పార్టీకి బాగా చెడ్డపేరు వస్తోందని అసంతృప్తిని వ్యక్తం చేసారు. తండ్రి జోక్యాన్ని నియంత్రించలేకపోతే చేదు ఫలితాలు తప్పవన్నారు.
పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ లలితతో మట్లాడుతూ ‘భర్తను దూరం పెట్టకపోతే కష్టమ’న్నారు. ప్రతీదానికి భర్త జోక్యం వల్ల చెడ్డ పేరు వస్తోందని హెచ్చరించారు.
నగిరి నియోజకవర్గంలోని మూడు మండలాల్లో పరిస్ధితి బాగాలేదంటూ గాలి ముద్దుకృష్ణమనాయడును హెచ్చరించారు. పుంగనూరు మంత్రి అమరనాధ్ రెడ్డి నియోజకవర్గం కావటంతో ఏమీ మాట్లాడలేదు. గంగాధర నెల్లూరులో కూడా పరిస్ధితి ఆశించినంతగా లేదన్నారు.