చంద్రబాబుకు జగన్ అజెండానే దిక్కా ?
మొదటి నుండి తెలుగుదేశంపార్టీకి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే అజెండాను ఫిక్స్ చేస్తున్నట్లున్నారు. మిగిలిన విషయాల్లో ఎలాగున్నా ప్రత్యేకహోదా ఉద్యమాల్లో మాత్రం ఆ విషయం స్పష్టంగా కనబడుతోంది.
రాజకీయాల్లో 40 ఏళ్ళ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడు ఎటువంటి మొహమాటం లేకుండానే జగన్ ను ఫాలో అవుతుండటం విచిత్రంగా ఉంది. ప్రత్యేకహోదా విషయంలో జగన్ మొదటి నుండి ఒకే మాటమీదున్నారు. ఏపి అభివృద్ధికి ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు.
అదే సమయంలో చంద్రబాబు మాత్రం అనేకసార్లు మాట మార్చిన విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకహోదా డిమాండ్ తో జగన్ ఉద్యమాలు చేసినపుడు, యువభేరీలు నిర్వహించినపుడు చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు.
కేంద్రమంత్రివర్గంలో నుండి టిడిపి బయటకు వచ్చేయాలని, ఎన్డీఏలో నుండి టిడిపి వచ్చేయాలని జగన్ పదే పదే డిమాండ్ చేశారు. చంద్రబాబు అప్పట్లో పట్టించుకోలేదు. కానీ చివరకు ఏమైంది? కేంద్రమంత్రివర్గం నుండి తప్పుకున్నారు. తర్వాత ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారు.
హోదా కోసం పార్లమెంటును స్పందింపచేస్తామని జగన్ చెప్పారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామన్నారు. చంద్రబాబును కూడా అదే పని చేయమన్నారు. కానీ చంద్రబాబు పట్టించుకోలేదు. ఎప్పుడైతే జగన్ అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టారో చిరవకు చంద్రబాబు కూడా అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టారు.
రాజనామాలు చేసిన తర్వాత ఏపి భవన్లో ఆమరణ నిరాహార దీక్షలకు వైసిపి ఎంపిలు కూర్చున్నారు. తాజాగా పార్లమెంటు ఆవరణలోని గాంధి సమాధి వద్ద టిడిపి ఎంపిలు ఒక్కరోజు దీక్షలకు దిగుతున్నారు.
అంటే, త్వరలోనే టిడిపి ఎంపిలు కూడా ఆమరణ నిరాహార దీక్షలన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూశారా జగన్ అజెండాను చంద్రబాబు ఎలా ఫాలో అవుతున్నారో ?