వివాహేతర సంబంధంతోనే ఇంజక్షన్ గుచ్చి మర్డర్.. ముగ్గురు నిందితుల గుర్తింపు, ఇద్దరు అరెస్ట్..
నెల్లూరులో కలకలం రేపిన ‘లిఫ్ట్ అడిగి హత్య’ కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని తేల్చారు.
నెల్లూరు : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఇంజక్షన్ హత్య కేసు మిస్టరీ వీడింది. ముగ్గురు వ్యక్తులు పక్కా ప్రణాళికతో హత్యకు పాల్పడ్డారని.. లిఫ్టు అడగడం, అధిక డోసు మత్తు ఇంజక్షన్ గుచ్చడం, నంబర్ లేని ద్విచక్ర వాహనాన్ని వాడడం.. అంతా పక్కాగా అమలు చేశారని పోలీసులు తేల్చారు. ఈ ఘటనతో ప్రత్యక్షంగా సంబంధం ముగ్గురు నిందితులను గుర్తించారు. అందులో ఇద్దరిని మంగళవారం రాత్రి చింతకాని మండలం మత్కేలపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. వారిని బుధవారం అరెస్టు చూపే అవకాశం ఉంది. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు బుధవారం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
24 గంటల్లోనే తేల్చిన పోలీసులు..
చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా.. ముదిగొండ మండలం వల్లభి గ్రామ సమీపంలో అధిక డోసు మత్తు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా ఎస్పీ సీపీ విష్ణు వారియర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా వల్లభి గ్రామంలో విచారణ నిర్వహించి వివరాలు సేకరించారు. జమాల్ సాహెబ్ ను హత్య చేసిన తర్వాత నిందితులు నెంబర్ ప్లేట్ లేని టు వీలర్ పై పారిపోయిన విషయం తెలిసింది.
సెల్ ఫోన్ లొకేషన్, కాల్ డేటా ఆధారంగా చింతకాని మండలం మత్కేపల్లిలో విచారణ చేపట్టారు. మత్కేపల్లిలో గోదా మోహన్రావు వద్ద ఉన్న ద్విచక్ర వాహనానికి నెంబర్ ప్లేట్ లేదని తెలిసి ప్రశ్నించేందుకు వెళ్లారు. ఈ సమయంలో ఆందోళన చెందిన మోహన్ రావు పారిపోయినట్లు తెలిసింది. గాలింపు చేపట్టిన పోలీసులు గ్రామంలోనే తలదాచుకున్న మోహన్ రావును, జమాల్ సాహెబ్ కు ఇంజక్షన్ ఇచ్చిన నర్సింశెట్టి వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
వారిని విచారించగా ఈ మత్తు ఇంజక్షన్ మోహన్రావు బంధువైన ఆర్ఎంపి వైద్యుడు బండి వెంకన్న సరఫరా చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. బండి వెంకన్న పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని బుధవారం అరెస్ట్ చూపే అవకాశం ఉంది. కాగా, హత్య సమయం లో వాడిన నెంబర్ ప్లేట్ లేని సదరు వాహనానికి మంగళవారం ఉదయం కొత్త నెంబర్ ప్లేట్ పెట్టుకున్నట్లు గుర్తించారు.
పక్కా ప్లాన్ ప్రకారమే అంతా…
చింతకాని మండలం మదనపల్లికి చెందిన గోదా మోహన్రావు ఓ రైతు వద్ద గుమాస్తాగా పని చేస్తున్నాడు. నర్సింశెట్టి వెంకటేష్ ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి జమాల్ సాహెబ్ ను హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. బండి వెంకన్నను కలిసి అధిక డోసు మత్తు ఇంజక్షన్ ను సిద్ధం చేసుకున్నారు. జమాల్ సాహెబ్ ఏపీ లోని ఎన్టీఆర్ జిల్లా గండ్రాయిలో ఉంటున్న తన పెద్ద కుమార్తె వద్దకు వెళ్లేందుకు బొప్పారం గ్రామం నుంచి టూవీలర్ పై బయలుదేరాడు. ఈ విషయం తెలిసిన మోహన్ రావు, నర్సింశెట్టి వెంకటేష్ తమ ప్లాన్ అమలు చేశారు.
నెంబర్ ప్లేట్ లేని టు వీలర్ పై ఇద్దరూ బాణాపురం గ్రామ సమీపంలోకి చేరుకున్నారు. వెంకటేష్ రోడ్డుపై వేచి ఉండగా, మోహన్ రావు చాటుగా దాక్కున్నాడు. ద్విచక్ర వాహనంపై వస్తున్న జమాల్ సాహెబ్ ను వెంకటేష్ లిఫ్ట్ అడిగి వెనకాల ఎక్కాడు. ఆ తర్వాత కొంతసేపటి తర్వాత జమాల్ సాహెబ్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చాడు. ద్విచక్ర వాహనాన్ని ఆపగానే వెంకటేష్ దిగి పరిగెత్తాడు. వెనకాలే వస్తున్న మోహన్ రావు అతడిని బైక్పై ఎక్కించుకుని పారిపోయాడు. మరోవైపు జమాల్ సాహెబ్ షాక్ లోకి వెళ్లి చనిపోయాడు.