ప్రియురాలిపై మోజుతో... కట్టుకున్న భార్యను హతమార్చిన కసాయి భర్త
అక్రమ బంధానికి అడ్డుగా వుందని ఏకంగా భార్యనే అతి కిరాతకంగా హతమార్చాడో భర్త. ఈ దారుణం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఖమ్మం: పెళ్లయిన తర్వాత కూడా మరో యువతితో అక్రమసంబంధాన్ని కొనసాగించాడో ప్రబుద్దుడు. అంతటితో ఆగకుండా అక్రమ బంధానికి అడ్డుగా వుందని ఏకంగా భార్యనే అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ దారుణ హత్యకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా పెగళ్లపాడు గ్రామానికి చెందిన యరమల బుజ్జినాగశేషురెడ్డికి కొన్నేళ్ల క్రితమే పెళ్లయ్యింది. అయితే అతడు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. చాలాకాలంగా గుట్టుగా సాగుతున్న అతడి అక్రమసంబందం గురించి భార్యకు తెలిపింది. దీంతో భార్యాభర్తల మద్య గొడవలు మొదలయ్యాయి.
ఇలా భార్య తన అక్రమ సబంధానికి అడ్డుగా మారడంతో నాగశేషు రెడ్డి దారుణానికి ఒడిగట్టాడు. ఈనెల 2వ తేధీన భార్య నవ్యను సత్తుపల్లి సమీపంలోని ఇంజినీరింగ్ కళాశాల వద్ద దింపి వస్తానని కుటుంబసభ్యులకు చెప్పి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. ముందే వేసుకున్న పథకం ప్రకారం నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి శీతలపానీయంలో నిద్రమాత్రలు వేసి తాగించి చున్నీతో ఉరేసి హత్య చేశాడు. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరించాడు.
అయితే అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా వుండటంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.