ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లల్లో ఏ ఒక్కరైనా వచ్చే నెల 4 తర్వాత పాఠశాల, కాలేజీకి వెళ్లకుండా వున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రవీణ్ ప్రకాష్ సవాల్ విసిరారు.
ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల వయసు నుంచి 18 ఏళ్ల వయసు మధ్యలో వున్న పిల్లలంతా బడిలోనో, ఓపెన్ స్కూలులోనో, కాలేజీలోనో చదువుకుంటూ వుండాలన్నారు. దీనికి అనుగుణంగా సెప్టెంబర్ 4వ తేదీలోపు స్థూల ప్రవేశాల నిష్పత్తి వంద శాతం వుండాలని ప్రవీణ్ ప్రకాష్ అధికారులకు సూచనలు చేశారు. వాలంటీర్లు, టీచర్లు, లెక్చరర్లు, అధికారులు అంతా కలిసి ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
2005 సెప్టెంబర్ నుంచి 2018 ఆగస్ట్ మధ్య పుట్టిన పిల్లల్లో ఏ ఒక్కరైనా వచ్చే నెల 4 తర్వాత పాఠశాల, కాలేజీకి వెళ్లకుండా వున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రవీణ్ ప్రకాష్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఇప్పటికే 464 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని పిల్లల్లో వంద శాతం మంది చదువుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఏపీ వ్యాప్తంగా ఇదే స్పూర్తిని కొనసాగించాలని ప్రవీణ్ ప్రకాష్ అధికారులకు సూచించారు. దేశంలో నూటికి నూరు శాతం జీఆర్ఈ సాధించిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించాలని సూచించారు.
