ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేష్ కుమార్ మీనా నియామకం
సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం వున్నప్పటికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపట్టింది. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రదానాధికారిగా సీనియస్ ఐఎఎస్ అధికారి ముకేష్ కుమార్ మీనాను నియమించింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO)గా ముకేష్ కుమార్ మీనా (mukesh kumar meena)ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ప్రస్తుతం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) గా కొనసాగుతున్న కె. దయానంద్ స్థానంలో మీనాను నియమితులయ్యారు. ఈ మేరకు ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే నూతన సీఈవో గా మీనాను నియమించినట్లు ఈసీఐ వెల్లడించింది.
సీనియర్ ఐఎఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసిన మీనాకు వివాదనరహితుడిగా, అజాత శత్రువుగా మంచిపేరు వుంది. ప్రస్తుతం ఆయన వాణిజ్య పన్నులు, చేనేత జౌళి, ఆహార పరిశ్రమల శాఖ కార్యదర్శగా కొనసాగుతున్నారు. గతంలో రాజ్ భవన్ కార్యదర్శిగా పనిచేసి గవర్నర్ అభినందనలు కూడా అందుకున్నారు. మరో రెండేళ్లలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తాడన్న నమ్మకంతో ఈసీఐ మీనాను ఎన్నికల ప్రదానాధికారిగా నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ (Sameer sharma) పదవీ కాలాన్ని కూడా కేంద్రం పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆరు నెలల పాటు... అంటే నవంబర్ 30 వరకు ప్రస్తుత సీఎస్ పదవీకాలాన్ని పొడిగించింది. సీఎస్ పదవీ కాలం పెంపుపై డీవోపీటీ (dopt) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే గతం ఒకసారి సమీర్ శర్మ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. నిజానికి గతేడాది నవంబర్ 30తో ఆయన పదవీకాలం ముగిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2022 మే 31 వరకు ఆరు నెలల పాటు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించింది కేంద్రం. ఇప్పుడు మరోసారి పొడిగించింది.