తనకు టికెట్ రాదని కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని విరుచుపడ్డారు.
తిరుపతి : తనకు ఈ సారి టికెట్ రాదని కొంతమంది ప్రచారం చేసి శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే రోజా. ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు మొదలు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ముందు వరుసలో ఉన్నానని చెప్పుకొచ్చారు. తనకు టికెట్ రాదని కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని విరుచుపడ్డారు.
ఒక్కచోట పోటీచేస్తే గెలుస్తామో, లేదో అన్న అనుమానంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలో రెండేసి నియోజకవర్గాల్లో సర్వే చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ రాదని శునకానందం పొందుతున్నారని చెప్పుకొచ్చారు. కానీ వారి ఆశ ఫలించదన్నారు. జగనన్న మాట శిరోధార్యం అని.. ఆయన ఏం చెబితే అది చేస్తానని చెప్పుకొచ్చారు. కాగా, సిట్టింగు సీట్ల విషయంలో వైసీపీలో మార్పులు, చేర్పులు.. టికెట్ల నిరాకరణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నగరి ఎమ్మెల్యే రోజాకు ఈ సారి టికెట్ దక్కదంటూ ప్రచారం జరుగుతోంది.
వైసీపీలో స్థానచలనాలు ఎస్సీలకేనా? ఇప్పటివరకు ఎంతమందిని మార్చారంటే...
దీనికి కారణం ఏంటంటే.. గత కొద్ది రోజులకుగా వైసీపీలో మార్పులు ఏపీని వణికిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికార వైసిపి రెండోసారి ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను కూడా స్థానచలనం చేస్తోంది. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో కొత్త సమన్వయకర్తల ఏర్పాటుతో.. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ లేదని చెప్పకనే చెప్పింది. మరోవైపు ముగ్గురు మంత్రుల సీట్లు మార్చింది. తాజాగా సోమవారం మరో మంత్రికి కూడా ఇదే జరిగింది.
సోమవారం నాడు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నంతా జరిగింది. సోమవారం కొంతమందికి స్థానచలనం కలగగా, మరి కొంతమందికి అసలు టికెట్టే దక్కదని తెలిపారు. ఇద్దరు ఎస్సీ శాసన సభ్యులు, ఒక ఎస్ టి ఎమ్మెల్యేకు స్థాన చలనం తప్పదని తెలుస్తోంది. ‘టికెట్ ఇవ్వలేదని నిరుత్సాహపడద్దని…ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు దిశగా కృషి చేయాలని.. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే వారిని చూసుకుంటాం’ అని హామీ ఇచ్చి బుజ్జగించి పంపినట్లుగా సమాచారం.
సోమవారం నాడు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల వైసిపి ప్రాంతీయ సమన్వయకర్త పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి కూడా సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు.
ఇప్పటికే గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలిగిరికి స్థానం లేకుండా చేశారని.. ఆయన 2019లో టిడిపి నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీకి మద్దతు పలికారని తెలిపారు. మరి తన పరిస్థితి ఏమిటని మాట్లాడినట్లుగా సమాచారం. ఈయన బాటలోనే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కూడా సోమవారం ముఖ్యమంత్రిని కలిసి ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పేశానని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కొత్త సమన్వయకర్తల ప్రకటనతోనే స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ మార్పుల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎస్సీలనే ఎక్కువగా మారుస్తుండడం చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల క్రితం 11 నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో ఐదుగురు దళితులు, ముగ్గురు బీసీలు ఉన్నారు. ఇదే కోవలో సోమవారం కలిసిన వారిలో కూడా ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్టీ ఎంపీ ఉండబోతున్నట్లుగా సమాచారం.
