దుట్టా రామచంద్రారావు,  యార్లగడ్డ వెంకట్ రావు  భేటీ కావడం వైసీపీలో  కలకలం రేపుతుంది.గన్నవరం నుండి గత ఎన్నికల్లో  యార్లగడ్డ వెంకట్ రావు  వైఎస్ఆర్‌సీపీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.


అమరావతి: వచ్చే ఎన్నికల్లో తాను గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తానని యార్లగడ్డ వెంకట్ రావు ప్రకటించారు.సోమవారంనాడు వైఎస్ఆర్‌సీపీ నేత దుట్టా రామచంద్రారావుతో యార్లగడ్డ వెంకట్ రావు భేటీ అయ్యారు.ఈ భేటీ ముగిసిన తర్వాత యార్లగడ్డ వెంకట్ రావు మీడియాతో మాట్లాడారు.తాను గన్నవరం రాజకీయాల్లో కొనసాగుతున్నట్టుగా ప్రకటించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:దుట్టాతో యార్లగడ్డ భేటీ: గన్నవరం వైసీపీలో ఏం జరుగుతుంది ?

కొంతకాలంగా కొన్ని కారణాలతో తాను అజ్ఞాతవాసంలో ఉన్నట్టుగా యార్లగడ్డ వెంకట్ రావు చెప్పారు. అయితే వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుండి పోటీ చేస్తానని యార్లగడ్డ వెంకట్ రావు ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తారని ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే తాను ఏ పార్టీలో ఉన్నానని ఆయన మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు.

తాను ఏం మాట్లాడినా ఏదో రకంగా వక్రభాష్యం చెప్పే ప్రయత్నం చేస్తారని మీడియా ప్రతినిధులపై వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేస్తారా అని ఆయనను కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే ఊహజనిత ప్రశ్నలకు రాజకీయ నేతలు సమాధానం ఇస్తారా అని బదులిచ్చారు

గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత తాను తిరిగి అమెరికాకు వెళ్లిపోతానని కూడ ప్రచారం చేశారని వెంకట్ రావు గుర్తు చేశారు. ఎన్నికలయ్యాక తాను అమెరికాకు రెండు మూడు దఫాలు వెళ్లి వచ్చానన్నారు. తన వ్యాపారాలు అమెరికాలో ఉన్నా కూడ తాను మాత్రం గన్నవరంలో రాజకీయాల్లో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.

అయితే వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుండి పోటీ చేస్తానని యార్లగడ్డ వెంకట్ రావు తేల్చి చెప్పడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. గత కొంత కాలంగా యార్లగడ్డ వెంకట్ రావు టీడీపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుండి వైఎస్ఆర్‌సీపీ టికెట్టు వల్లభనేని వంశీకి దక్కే అవకాశం ఉంది.ఈ తరుణంలో వెంకట్ రావు వచ్చే ఎన్నికల్లో తాను బరిలో ఉంటానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.