సైకిల్ పంక్చర్ షాపు నుండి వందల కోట్లు వడ్డీ వ్యాపారం చేసే స్థాయికి కందిశెట్టి రమేష్ ఎదిగాడు. రాజకీయ నాయకులు, పోలీసుల అండతోనే వడ్డీ వ్యాపారాన్ని విస్తరించాడనే ప్రచారం కూడ లేకపోలేదు. రమేష్ ఇంటిపై రెండు రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.


తిరుపతి: సైకిల్ పంక్చర్ షాపు నుండి వందల కోట్లు అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగాడు కందిశెట్టి రమేష్. రాజకీయ అండదండలతోనే రమేష్ వ్యాపారం యధేచ్ఛగా సాగిందనే విమర్శలు కూడ లేకపోలేదు. తాజాగా రమేష్ ఇంటిపై ఐటీ దాడులు చేసుకోవడం వెనుక కూడ ఓ రాజకీయ నాయకుడు ఉన్నాడనే ప్రచారం సాగుతోంది. అయితే రెండు రోజులుగా ఐటీ అధికారులు రమేష్ ఇంటిపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో భారీగా నగదు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకొంటున్నారని సమాచారం.

చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన రమేష్ అనే వడ్డీ వ్యాపారి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తొలుత సైకిల్ పంక్చర్ షాపును నిర్వహించే రమేష్ ఆ తర్వాత వడ్డీ వ్యాపారాన్ని ఎంచుకొన్నాడు. అయితే ఈ వ్యాపారం విజయవంతంగా సాగడానికి రాజకీయ నాయకులు, పోలీసుల అండగా ఉందనే విమర్శలు కూడ లేకపోలేదు.

వడ్డీ వ్యాపారి రమేష్‌పై ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీసుులే ఫిర్యాదుదారుడిని వేధించేవారనే ఆరోపణలు కూడ లేకపోలేదు. అయితేరాజకీయ అండదండల కారణంగానే రమేష్ వ్యాపారం యధేచ్చగా సాగిందని స్థానికులు చెబుతుంటారు.

అయితే ఒక రాజకీయ నేతతో వచ్చిన విబేధాల కారణంగానే రమేష్‌పై ఐటీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఐటీ అధికారుల దాడుల్లో భారీ ఎత్తున ప్రాంసరీ నోట్లు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం. చెన్నై, తిరుపతితో పాటు ఆయన స్వగ్రామంలో కూడ ఐటీ అధికారులు దాడులు నిర్వహించారని సమాచారం.

రమేష్ గతంలో చెన్నైలో ఓ గ్యాంగ్‌స్టర్‌కు వడ్డీకి డబ్బులు ఇచ్చారు. అయితే డబ్బులు ఇవ్వాలని గ్యాంగ్‌స్టర్‌ను డిమాండ్ చేస్తే అ తను కిడ్నాప్ చేశారని చెబుతుంటారు. ఆ సమయంలో కొందరు పోలీసులు, రాజకీయ నేతల జోక్యంతో గ్యాంగ్‌స్టర్ నుండి రమేష్ సురక్షితంగా బయటపడ్డాడని ప్రచారంలో ఉంది. సైకిల్ పంక్చర్ షాపు నుండి వడ్డీ వ్యాపారం చేస్తూ వందల కోట్లు సంపాదించే స్థాయికి ఎదగడం సాధారణ విషయం కాదు.

ప్రజారాజ్యం ఆవిర్భావం సమయంలో రమేష్ పీఆర్పీలో కీలకంగా వ్యవహరించారు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత మరో ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉండేవాడు. రాజకీయ పార్టీల అండలు రమేష్‌కు ఉన్నాయని చెబుతుంటారు.