మున్సిపల్ ఎన్నికలు: టీఆర్ఎస్కు కాంగ్రెస్ చెక్, వ్యూహమిదీ..
మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర జనాభాలో ఉన్న బీసీలకు ఎక్కువ టిక్కెట్లను కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకొంది.
హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీసీ, ముస్లింలకు సగం టిక్కెట్లను కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర జనాభాలో బీసీ సంఖ్య సగానికి పైగా ఉంటుంది. దీంతో బీసీలను ఆకర్షించేందుకుగాను కాంగ్రెస్ నాయకత్వం ఈ ప్లాన్ చేసినట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఇటీవల సమావేశమయ్యారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకొన్నారు.
రాష్ట్రంలో ఉన్న బీసీ జనాబా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
ఈ మేరకు ఈ విధానాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జగన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ మంచి మెజారిటీతో ఎక్కువ స్థానాలను గెలుచుకొంటుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.
ప్రతి ఇంటికి కాంగ్రెస్ ను తీసుకెళ్లేందుకు వీలుగా కార్యకర్తలు ముందుకు వెళ్లాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.ఈ నెల 19వ తేదీ వరకు కాంగ్రెస్ పార్టీ పతాకాలను ఆవిష్కరించాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. ఈ సమావేశం నిర్ణయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు పాస్ చేసే సమయంలో పార్లమెంట్ తలుపులు మూసి బిల్లును పాస్ చేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన విమర్శలను ఆయన తప్పుబట్టారు.రాజ్యసభ, లోక్ సభలో ఓటింగ్ జరిగే సమయంలో తలుపులు మూసివేస్తారని ఆయన గుర్తు చేశారు.