ఏపీ మంత్రి విశ్వరూప్ హెల్త్ బులిటెన్ విడుదల.. ఆయన ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందంటే..
ఆంధ్రప్రదేశ్ మంత్రి పినిపే విశ్వరూప్ అనారోగ్య సమస్యలతో శుక్రవారం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి పినిపే విశ్వరూప్ అనారోగ్య సమస్యలతో శుక్రవారం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆస్పత్రి వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మంత్రి విశ్వరూప్ తేలికపాటి బ్రెయిన్ స్ట్రోక్ నుంచి ఆయన కోలుకున్నట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టుగా వెల్లడించారు.
‘‘పినిపే విశ్వరూప్ సెప్టెంబర్ 2వ తేదీన సిటీ న్యూరో సెంటర్లో తేలికపాటి బ్రెయిన్ స్ట్రోక్తో అడ్మిట్ అయ్యారు. దాని నుండి ఆయన పూర్తిగా కోలుకున్నారు. ఆయన ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉన్నారు. స్ట్రోక్కు కారణం ఏమిటనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని సీనియర్ కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ డాక్టర్ బి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. మరోవైపు విశ్వరూప్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని చెప్పారు.
అసలేం జరిగిందంటే..
మంత్రి విశ్వరూప్ శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా అమలాపురం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అమలాపురం రూరల్ మండలం ఎ వేమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు - నేడు కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఆ సమయంలో చేతికి కాస్త నొప్పి, నరాల సమస్య రావడంతో అమలాపురం వైద్యులను సంప్రదించారు. నరాల సంబంధిత సమస్యతో మంత్రి చేతులు ఎత్తలేకపోవడంతో రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్తో పాటు స్థానిక రాజకీయ నాయకులు ఆసుపత్రికి వచ్చి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. అయితే మెరుగైన వైద్యం కోసం విశ్వరూప్ను హైదరాబాద్కు తరలించారు.