అక్రమ సంబంధమనే అనుమానం: లారీతో ఢీకొట్టి భార్యను చంపేశాడు
విజయనగరం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.
విజయనగరం: విజయనగరం జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ భర్త భార్యను లారీతో ఢీకొట్టి చంపేశాడు.
భార్య రమణమ్మ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని కొన్నేళ్లుగా భర్త తవిటయ్య అనుమానిస్తూ వచ్చాడు. ఆ స్థితిలో వేరొకరి బైకుపై వస్తున్న ఆమెను చూసి కోపం పట్టలేకపోయాడు.
తాను నడుపుతున్న లారీ ఏకంగా బైకుపైకి పోనిచ్చాడు. దాంతో రమణమ్మ అక్కడికక్కడే మరణించగా, బైకు నడుపుతున్న రామకృష్ణ గాయపడ్డాడు. రామకృష్ణ రమణమ్మకు వరుసకు మరిది అవుతాడు.
విజయనగరం జిల్లా గరివిడి మండలం కాపుశంభాం గ్రామానికి చెందిన రమణమ్మకు, తవిటయ్యకు 20 ఏళ్ల కిందట వివాహమైంది. తవిటయ్య లారీ డ్రైవర్. గురువారం ఉదయం తవిటయ్య లారీలో వస్తూ భార్యకు ఫోన్ చేశాడు.
సుభద్రాపురం జంక్షన్కు వస్తే ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చి వెళ్తానని చెప్పాడు. తనకు మరిది వరసైన రామకృష్ణతో బైక్పై వస్తున్న ఆమెను చూసి లారీతో ఢీకొట్టాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.