భార్యపై అనుమానం.. గొంతు పిసికి చంపి, కాలువలో విసిరేసి...మిస్సింగ్ డ్రామా...
వివాహేతర సంబంధం అనుమానంతో ఓ భర్త కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని కాలువలో పడేసి ఏమీ ఎరగనట్టు మిస్సింగ్ కంప్టైంట్ ఇచ్చాడు.
West Godavari : ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రులో దారుణ ఘటన చోటుచేసుకుంది. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త అతికిరాతకంగా భార్యను హత్య చేసి పంట కాలువలో పడేసిన ఉదంతం నిడమర్రు మండలంలో వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం అనుమానంతోనే ఈ ఘాతుకానికి పాల్పడడం.. స్థానికంగా కలకలం రేపింది. నిడమర్రు ఎస్ఐ కే గురవయ్య, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమర్రు గ్రామానికి చెందిన వీరన్న, రమ్య (26)కు ఆరేళ్ల కిందట వివాహమయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరన్న వ్యాన్ నడుపుతుంటాడు. రమ్య కూలీ పనులు చేస్తుంది. అలా వారు సంసారాన్ని నెట్టుకొస్తున్నారు.
ఈ క్రమంలో వీరన్నకు తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం కలిగింది. ఈ విషయం మీద గత నెల 31వ తేదీ రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ చిలికి చిలికి గాలివానగా మారడంతో.. కోపం పట్టలేని వీరన్న భార్యను పీక పిసికి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో మృత దేహాన్ని తన వ్యాన్లోకి ఎక్కించి, నిడమర్రు కాలనీ సమీపంలో ఉన్న వంతెన వద్దకు తీసుకువెళ్ళాడు. అక్కడ వ్యాను ఆపుకుని మృతదేహాన్ని పై నుంచి కాల్వలోకి విసిరేశాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు.
ఆస్తికోసం.. బామ్మర్థిని చంపి, గోతిలో పూడ్చిపెట్టిన బావ.. రెండునెలల తరువాత వెలుగులోకి..
అనుకున్నపని సజావుగా అయిపోవడంతో.. ఏమీ తెలియనట్టు నాటకం మొదలుపెట్టాడు. తన భార్య కనిపించడం లేదని చెప్పి బంధుమిత్రులతో కలిసి చుట్టుపక్కలా గాలించాడు. అంతేకాదు ఈ మేరకు నిడమర్రు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే వీరన్నపైనే అనుమానం ఉందని రమ్య తల్లి సత్యవతి ఫిర్యాదు చేయడంతో కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు ఆ దిశగా విచారించగా.. వీరన్నే నేరం చేశాడని తేలింది. నేరాన్ని అంగీకరించిన వీరన్న.. భార్య మృతదేహం ఎక్కడ పడేసిందీ ఆచూకీ తెలిపాడు. పోలీసులు గురువారం కాలువలో గాలించగా తూడులో చిక్కుకుని కుళ్లిపోయి ఉన్న రమ్య మృతదేహం లభించింది. వీరన్నపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నట్లు ఎస్సై తెలిపారు.