గుంటూరు జిల్లాలో పరువుహత్య... కన్న కూతురిని హతమార్చిన కసాయి తల్లిదండ్రులు?
గుంటూరు జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ వ్యవహాారం బయటపడటంతో కన్న కూతురినే కడతేర్చారు కసాయి తల్లిదండ్రులు.
గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కూతురు ప్రేమ వ్యవహారం గురించి తెలిసి తల్లిదండ్రులే కసాయిగా వ్యవహరించారు. కన్న కూతురిని అతి కిరాతకంగా హతమార్చి... మృతదేహాన్ని మాయం చేయడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు.
ఈ పరువు హత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన భవాని(18) ఓ యువకున్ని ప్రేమిస్తోంది. ఈ విషయం తెలియడంతో యువతిని తల్లిదండ్రులు నిలదీశారు. ఈ క్రమంలో కూతురికి - తల్లిదండ్రులకు మద్య వివాదం రేగింది. దీంతో కూతురి ప్రేమ వ్యవహారం బయటపడితే పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. కన్న కూతురినే హతమార్చి మృతదేహాన్ని మాయం చేయడానికి ప్రయత్నించారు.
read more ట్యాబ్లెట్స్ అనుకుని ఎలుకలమందు మింగి... మహిళ మృతి
భవాని మృతదేహాన్ని తల్లిదండ్రులు గుట్టు చప్పుడు కాకుండా దహనం చేశారు. అయితే ఈ విషయం ఎలాగో బయటకు పొక్కడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు భవాని తల్లిదండ్రులను ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.విచారణ అనంతర ఈ ఘటనకు సంబంధించిన విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
అయితే గ్రామస్తులు మాత్రం యువతి ఓ యువకున్ని ప్రేమించిందని... ఈ విషయం తెలిసే తల్లిదండ్రులు కూతురిని హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఇది పక్కా పరువు హత్యేనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.