హితేష్టిక్కెట్టుకు అడ్డంకులు: దగ్గుబాటికి క్లారిటీ ఇవ్వని జగన్
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేష్ వైసీపీలో చేరనున్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో హితేష్ వైసీపీలో చేరిక ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది.
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేష్ వైసీపీలో చేరనున్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో హితేష్ వైసీపీలో చేరిక ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. పర్చూరు నియోజకవర్గానికి హితేష్ను సమన్వయకర్తగా నియమించేందుకు కూడ టెక్నికల్ అంశాలే కారణంగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
దగ్గుబాటి హితేష్ చెంచురామ్ అమెరికాలోనే పుట్టాడు. ఆయనకు అమెరికా పౌరసత్వం కూడ ఉంది. దేశంలో ఎంపీ లేదా ఎమ్మెల్యే స్థానానికి లేదా ఇతర చట్టసభలకు ఎన్నికయ్యేందుకు పోటీ చేయాలంటే భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి. దరిమిలా హితేష్ అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేసుకొనేందుకు ధరఖాస్తు చేసుకొన్నారు.
ఈ నెల మొదటి వారంలోనే అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ హితేష్ అమెరికా ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకొన్నారు.దీనికి సంబంధించి ఇంకా అమెరికా ప్రభుత్వం నుండి స్పష్టత రావాల్సి ఉంది. అమెరికా పౌరసత్వం రద్దైనట్టుగా సమాచారం వస్తే దానికి అనుగుణంగా హితేష్ కార్యాచరణ ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ కారణంగానే జగన్ను కలవడం కూడ ఆలస్యమైందని చెబుతున్నారు.
ఫిబ్రవరి మొదటి వారంలో హితేష్ అమెరికా పౌరసత్వం రద్దయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ తర్వాతే హితేష్ వైసీపీలో అధికారికంగా చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అమెరికా నుండి హితేష్ పౌరసత్వం విషయమై స్పష్టత వచ్చిన తర్వాతే పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గానికి హితేష్ను సమన్వయకర్తగా ఆ పార్టీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు తొలుత టీడీపీలో ఉండేవారు. 1995లో టీడీపీ సంక్షోభం సమయంలో చంద్రబాబునాయుడు వైపు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆ తర్వాత ఆయన చంద్రబాబుకు కూడ దూరమయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ తర్వాత లక్ష్మీపార్వతి వైపుకు వెళ్లారు. 2004 ఎన్నికలకు ముందు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో పురంధేశ్వరీ విశాఖ ఎంపీగా విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా కూడ పనిచేశారు.
2004 ఎన్నికలకు ముందు వరకు వీరిద్దరూ కూడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన పురంధేశ్వరీ బీజేపీలో చేరారు. దగ్గుబాటి మాత్రం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పురంధేశ్వరీ 2014 ఎన్నికల్లో రాజంపేట నుండి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
వచ్చే ఎన్నికల్లో తన వారసుడిగా హితేష్ను రంగంలోకి దింపాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు భావిస్తున్నారు. పురంధేశ్వరీ మాత్రం బీజేపీలోనే కొనసాగుతారు. హితేష్ను పర్చూరు నియోజకవర్గం నుండి బరిలోకి దింపనున్నారు. ఈ మేరకు హితేష్తో కలిసి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆదివారం నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్తో భేటీ అయ్యారు.అమెరికా పౌరసత్వం విషయంలో స్పష్టత వచ్చిన తర్వాత హితేష్ వైసీపీలో అధికారికంగా చేరే అవకాశం ఉందని చెబుతున్నారు.