స్పీకర్ కోడెల కుమారుడికి నోటీసులు
- రైతు భూములను అక్రమంగా ఆక్రమించుకున్న కేసులో కోడెల శివరామకృష్ణకి కోర్టు నోటీలు
- ధూళిపాళ్ల గ్రామంలోని రైతు సుబ్బారావుకి చెందిన 11.60 ఎకరాలను ఆక్రమించుకున్న శివరామకృష్ణ
రైతు భూములను అక్రమంగా ఆక్రమించుకున్న కేసులో కోడెల శివరామకృష్ణకి కోర్టు నోటీలు జారీ చేసింది. శివరామకృష్ణ.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడన్న విషయం అందరికీ తెలిసిందే. జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ శివరామకృష్ణపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలోని రైతు సుబ్బారావుకి చెందిన 11.60 ఎకరాలను శివరామకృష్ణ ఆక్రమించుకున్నాడు. దీంతో బాధిత రైతు పోలీసులను ఆశ్రయించగా.. వారు కేసు నమోదు చేయలేదు. దీంతో బాధితుడు హైకోర్టులో కేసు వేశాడు. ఆయన వ్యాజ్యంపై తాజాగా హైకోర్టు స్పందించింది.
సుబ్బారావు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి, వివరణ ఇవ్వాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, గుంటూరు రేంజ్ ఐజీ, జిల్లా రూరల్ ఎస్పీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్ జనరల్, ఆర్డీవో, తహసీల్దార్లకు నోటీసులు జారీ చేశారు. అలాగే కోడెల శివరామ కృష్ణతో పాటు వ్యక్తిగత ప్రతివాదులుగా ఉన్న డీఎస్పీ ఎం.మధుసూదన్రావు, సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ వెంకటరావు, శివరామకృష్ణ పీఏ గుత్తా నాగప్రసాద్లకు కూడా నోటీసులిచ్చింది.