ప్రభుత్వ భవనాలను పార్టీ రంగులు... జగన్ ప్రభుత్వానికి షాకిచ్చిన హైకోర్టు
ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడంకోసం రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది.
అమరావతి: ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడంకోసం రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. ప్రస్తుతం ఉన్న మూడు రంగులకు అదనంగా వేస్తున్న రంగు పార్టీ రంగు కాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు కోర్ట్ కు వినిపించారు. అయితే సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించలేదని హైకోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది.
కోర్టు ధిక్కారం కింద సుమోటోగా తీసుకుంటున్నామని హెచ్చరించింది హైకోర్ట్. దీనిపై ఏపి సీఎస్, సీఈసీ, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి వివరణను ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 28న ఈ సుమోటో కేసుపై హైకోర్ట్ విచారణ జరిపే అవకాశం వుంది.
జీవో నంబర్ 623 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని పంచాయితీ కార్యాలయాలకి రంగులు వేసింది ఏపీ సర్కారు. అయితే ప్రభుత్వ కార్యలయాలకు వైసిపి పార్టీ రంగులు వేశారని ఆరోపిస్తూ జీవో నంబర్ 623ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ప్రభుత్వ భవనాలపై వైసీపీ జెండా రంగులే కనిపిస్తున్నాయని పిటిషనర్లు ఆరోపించారు.
ఆంధ్ర ప్రదేశ్ వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వున్న ప్రభుత్వ కార్యాలయ భవనాలను ముస్తాబు చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామాల్లోని పంచాయితీ భవనాలకు రంగులు వేయించింది. ఇంతవరకు బాగానే వున్న ప్రభుత్వం వేయించిన రంగులు వైసిపి జెండా రంగులను పోలివుండటం వివాదానికి దారితీసింది.
ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ రంగులు వేసిన వైసిపి సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అంతేకాకుండా ఇటీవల స్థానికి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలోనూ ఈసీకి దీనిపై ఫిర్యాదులు అందాయి. కొందరు కోర్టులను కూడా ఆశ్రయించారు.