రోడ్డు విస్తరణ కోసం రాజకీయ ప్రముఖులు, మహనీయుల విగ్రహాలను తొలగించడం నందిగామలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

విజయవాడ : ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు ఉద్రిక్తతకు దారితీసాయి. రోడ్డు విస్తరణకు అడ్డంగా వున్నాయంటూ గాంధీ సెంటర్ లోని విగ్రహాలను తొలగించడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. రాజకీయ నాయకులు, మహనీయుల విగ్రహాలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష టిడిపి శ్రేణులు ఆందోళనకు దిగాయి. పోలీసులు అడ్డుకోవడంతో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. 

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీలో రోడ్ల విస్తరణ చేపట్టింది వైసిపి ప్రభుత్వం. ఈ క్రమంలోనే గాంధీ సెంటర్ లో రోడ్డుకు అడ్డంగా వున్నాయంటూ రాజకీయ నాయకులు, మహనీయుల విగ్రహాలను తొలగించడానికి మున్సిపల్ అధికారులు సిద్దమయ్యారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే విగ్రహాల తొలగింపు చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. కానీ ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి ఒక్కసారిగా విగ్రహాలను తొలగించడంపై ఏమిటంటూ టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వీడియో

మున్సిపల్ కమీషనర్ ను కలిసి విగ్రహాల తొలగింపుపై మాట్లాడేందుకు వెళుతున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం వుందంటూ పోలీసులు తంగిరాల సౌమ్యతో పాటు టిడిపి శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ అధికారులు, పోలీసుల వైఖరిని ఖండిస్తూ టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి తంగిరాల సౌమ్య అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. 

Read More ఏలూరు జిల్లా వీరమ్మకుంట సర్పంచ్ ఎన్నిక: టీడీపీ, వైసీపీ పోటా పోటీ ప్రచారం, ఉద్రిక్తత

నందిగామ మున్సిపల్ కమీషనర్ కు ఫోన్ చేసి కేవలం గంట ముందు విగ్రహాల తొలగింపుపై సమాచారం ఇవ్వడమేంటని సౌమ్య నిలదీసారు. రోడ్డు విస్తరణ పేరుతో మహనీయులు విగ్రహాలను అర్ధరాత్రుళ్లు తొలగించడం దారుణమని తంగిరాల సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే మున్సిపల్ అధికారులు మాత్రం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అనుమతితోనే విగ్రహాలను తొలగించినట్లు చెబుతున్నారు.