మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడలో ఇద్దరు వైసీపీ నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. కృష్ణా జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు హనుమంతరావుకు మరో నేత సుధాకర్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి నెలకొంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి ముఖ్యమంత్రి కావాలని గట్టి పట్టుదలతో వున్నారు. కానీ నేతల నుంచి మాత్రం ఆయనకు సాయం అందడం లేదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక లొల్లి కనిపిస్తూనే వుంది. దీనిపై హైకమాండ్ సీరియస్ అవుతున్నా.. నేతల మధ్య సఖ్యత వుండటం లేదు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిథ్యం వహిస్తున్న గుడివాడలో ఇద్దరు వైసీపీ నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది.
కృష్ణా జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు హనుమంతరావుకు మరో నేత సుధాకర్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి నెలకొంది. తాజాగా గుడివాడలో జరిగిన సమావేశంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి సమక్షంలోనే వీరు తోపులాటకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సుధాకర్ కారును హనుమంతరావు వర్గీయులు ధ్వంసం చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపు చేశారు. అయితే ఈ దాడులకు పాత కక్షలే కారణమని పోలీసులు చెబుతున్నారు.
