ఏపీ మూడు రాజధానుల వ్యవహారం హాట్ హాట్‌గా వున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతుల పాదయాత్ర ఓ వైపు... జేఏసీ నేతల ఆందోళనలు మరోవైపు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా నిదడవోలులో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.  

తూర్పుగోదావరి జిల్లా నిదడవోలు ఓవర్‌బ్రిడ్జి పోటాపోటీ నినాదాలతో హోరెత్తింది. అమరావతి రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రకు వ్యతిరేకంగా జేఏసీ నేతలు ఉదయం నుంచి నల్ల బెలూన్లు ఎగురవేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్ర కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. అమరావతికి రైతులు ఆకుపచ్చ కండువాలు ఎగురేస్తుండగా.. జేఏసీ నేతలు నల్ల కండువాలు ఎగురవేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు, ఫేక్ యాత్రికులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు నేతలు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు పరిస్ధితిని అదుపు చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరోవైపు... విశాఖపట్టణం కేంద్రంగా మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. మరో వైపు అమరావతి నుండి అరసవెల్లికి పాదయాత్రగా అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో రైతుల పాదయాత్ర సాగుతుంది. ఈ తరుణంలో విశాఖపట్టణం కేంద్రంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రాజధానులను జనసేన వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమరావతి రాజధానికే పవన్ కళ్యాణ్ తన మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. అమరావతికి తొలుత మద్దతు ప్రకటించిన వైసీపీ ఆ తర్వాత మూడు రాజధానులను తెరమీదికి తీసుకువచ్చిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

Also Read:ఉత్తరాంద్ర అభివృద్ది చెందక మా గుండెలు రగిలిపోతున్నాయి: ఏపీ మంత్రి ధర్మాన

మూడు రాజధానులకు మద్దతుగా ఈ నెల 15న విశాఖపట్టణంలో విశాఖగర్జన నిర్వహించడంపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. వికేంద్రీకరణపై పవన్ కళ్యాణ్ ప్రశ్నలు కురిపించారు. వైసీపీ సర్కార్ తీరును ట్విట్టర్ వేదికగా ఆయన ఎండగట్టారు. జనసేన ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శలపై వైసీపీ కూడా తీవ్రంగా స్పందించింది. జనసేనాని చేసిన విమర్శలపై మంత్రులు, వైసీపీ నేతలు సోషల్ మీడియాతో పాటు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి బహిరంగంగానే విమర్శలు చేశారు.