టీడీపీ నేత పయ్యావుల కేశవ్కు భారీ ఊరట.. భద్రత కల్పించాల్సిందేనన్న హైకోర్టు..
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ను భద్రత కల్పించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ను భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రతా సిబ్బందిని తొలగించడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా.. ఐదు లేదా ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది పేర్లు ఇవ్వాలని పిటిషనర్కు హైకోర్టు సూచించింది. వారిలో ఇద్దరిని సెక్యూరిటీగా నియమించేందుకు తగిన ఆదేశాలు ఇస్తామని తెలిపింది.
అయితే విచారణ సందర్భంగా గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించినా.. ప్రభుత్వం స్పందించకపోవడంపై పిటిషనర్ తరఫు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు పిటిషనర్ పేర్లు ఇవ్వాలని హైకోర్టు సూచించడం పట్ల ప్రభుత్వ లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రత కల్పించాల్సిన వ్యక్తులపై పిటిషనర్కు నమ్మకం ఉండాలి కదా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఇక, ఉరవకొండలో పరిస్థితులు ఏంటో తెలుసని.. అటువంటప్పుడు ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. పయ్యావుల కేశవ్కు వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇక, ప్రభుత్వం తనకు సెక్యూరిటీని తొలగించడాన్ని పయ్యావుల కేశవ్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు భద్రతను తిరిగి పునరుద్ధరించేలా పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. గత విచారణ సందర్భంగా.. పయ్యావులకు ముందు 2+2 భద్రత ఉండేదని ఆయన న్యాయవాది చెప్పారు. దీనిని ప్రభుత్వం 1+1 కు కుదించిందని.. తరువాత పూర్తిగా ఉపసంహరించిందని తెలిపారు. ఆయనకు 2+2 భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలోనే డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్), అనంతపురం ఎస్పీలను కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.